Danam Nagender: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. విభజన తరువాత ఏపీ, తెలంగాణ చాలా నష్ట పోయాయని తెలిపారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సమయంలో రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదు అని డీలర్, కలెక్టర్ను ప్రశ్నించారని దానం నాగేందర్ అన్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వస్తారని ఆయన ప్రశ్నించారు. మూసీకి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నోసార్లు అడిగారని చెప్పారు.
తెలంగాణకు నిధులు కేటాయించలేదని దానం నాగేందర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారిని హైదరాబాద్లో తిరగనివ్వమని అన్నారు. ఇలాంటి ఆర్థిక మంత్రి దేశానికి ఉండటం అరిష్టమని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న వాటినీ కూడా అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు.