ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరు అయిన రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయనున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాక కొనుగోలు చేయడానికి ఎవరూ రాకపోవడంతో అమ్ముడుపోకుండా పాడుబడ్డ గూళ్ల తరహాలో ఉండిపోయాయి. వీటన్నింటినీ వేలంలో అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వ కార్యదర్శులతో ఉన్నతస్థాయి త్రిసభ్య కమిటీ నియామకం చేపట్టింది. గృహనిర్మాణ శాఖను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ముందుగా బండ్లగూడ, పోచారంలలో ఉన్న గృహ సముదాయాలను వేలం ద్వారా అమ్మనున్నారు. వాటికి ఏ ధర నిర్ణయించాలో తేల్చేందుకు రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న సంస్థను సంప్రదించనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ ఇళ్లను మొత్తంగా కొనేయాలనే ఆలోచనలో ఉన్నాయట. బండ్లగూడ, పోచారంలో దాదాపు నాలుగువేల ఇళ్లతో కూడిన సముదాయాలు సిద్ధంగా ఉన్నాయి.
గాజుల రామారం, జవహర్నగర్లలో అసంపూర్తి నిర్మాణాలు ఉన్నా, వాటి విషయంలో కాస్త నిదానంగానే నిర్ణయాలు తీసుకుంటారు.