Southwest Monsoon : నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ కీలక అప్డేట్.. కేరళను తాకేది ఆరోజే.. తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే?
Southwest monsoon :ఐఎండీ అంచనా ప్రకారం.. మే 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాల్సి ఉంది. కానీ, ఆలస్యం కావడంతో జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని అంచనా వేశారు. కానీ, నైరుతి రాక ఇంకాస్త ఆలస్యం అవుతుందని తాజాగా ఐఎండీ ప్రకటించింది.
southwest monsoon
Southwest Monsoon : వేసవి ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడపాదడపా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నా.. ఎండ వేడిమి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే, ఈసారి నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చేస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. తాజా వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.
Also Read : Siddaramaiah : కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య భేటీ.. డిమాండ్స్ ఇవే.. కొడుకు కోసమే పట్టు..! ఈ శాఖలపైనే గురి
ఐఎండీ అంచనా ప్రకారం.. మే 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాల్సి ఉంది. కానీ, ఆలస్యం కావడంతో జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని అంచనా వేశారు. కానీ, నైరుతి రాక ఇంకాస్త ఆలస్యం అవుతుందని తాజాగా ఐఎండీ ప్రకటించింది. జూన్ 4, 5 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, కేరళను తాకిన రెండుమూడు రోజుల తరువాత ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గాలంటే మరో వారం పదిరోజుల పట్టే అవకాశం ఉంది.
భారతదేశంలో పలు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం ప్రారంభం నైరుతి రుతుపవనాల రాకపైనే ఆధారపడి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు కూడా జోరుగా ముందుకు సాగుతాయి. దీంతో రైతులు రుతుపవనాల రాకకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. గతేడాది అంచనా వేసిన సమయానికంటే ఎనిమిది రోజుల ముందుగానే మే 24వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మే 26న తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈసారి మాత్రం గతం కంటే పదిరోజులు ఆలస్యంగా నైరుతి తెలంగాణను పలుకరించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్లోనూ యూపీ, హరియాణా, పంజాబ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
