సిల్వర్ జూబ్లీ సభకు 10 లక్షల జనం టార్గెట్.. లెక్క తక్కువ కావద్దు..
అందుకే వరంగల్ సిల్వర్ జూబ్లీ సభకు భారీ ఎత్తున జనాన్ని తరలించి తమ సత్తా చాటుకోవాలని నేతలు ప్రయత్నిస్తున్నారంట.

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10లక్షలు. అంతకు మించి అయినా పర్వాలేదు గాని లెక్క మాత్రం తక్కువ కాకూడదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు ఫిక్స్ చేసిన టార్గెట్ ఇది. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహిస్తున్న పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు 10 లక్షల జన సమీకరణ చేయాలని గులాబీ బాస్ ఆదేశించారంట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ కు 10 లక్షల మంది జనాన్ని తరలించగలమా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట గులాబీ పార్టీ నేతలు.
గులాబీ పార్టీ రజతోత్సవ సంబురాలకు సిద్దమవుతోంది. పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఈ నెల 27న వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది.. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జిల్లాల వారిగా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో లీడర్లకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ 10 లక్షల మందితో రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆర్డర్ పాస్ చేశారంట.
అధికారంలో లేకపోయినా భారీ జన సమీకరణతో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభను నిర్వహించి పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని చెప్పారంట కేసీఆర్. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లా పర్యటనలు చేసి మరీ ఓరుగల్లు సభకు సన్నాహాలు చేస్తున్నారు.. మరోవైపు హరీష్ రావు, కవిత సైతం సైతం రంగంలోకి దిగారు.
కేసీఆర్ టార్గెట్ ఫిక్స్
ఇంతవరకు బాగానే ఉన్నా.. వరంగల్ సభకు జన సమీకరణపైనే పార్టీ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేల మంది జనాన్ని తరలించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే కనీసం 3వేల నుంచి 5వేల మందిని తరలించడం కూడా కష్టమేననే టాక్ వినిపిస్తోందట. అలా ఒక్కో నియోజకవర్గం నుంచి 5వేల మందిని తరలించినా 100 నియోజకవర్గాలకు 5 లక్షల మందే అవుతారు. కానీ కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసింది 10 లక్షల జనసమీకరణ కోసం.
Also Read: ఇంటర్ తర్వాత ఏయే కోర్సుల్లో చేరవచ్చు.. ఈ కోర్సుల గురించి మీకు తెలుసా?
మరి అంత మందిని వరంగల్ సభకు ఎలా తరలించాలనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంట గులాబీ పార్టీ నేతలు. అందులోనూ మెజార్టీ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారని..హైదరాబాద్ నుంచి జనాన్ని తరలించడం సాధ్యం కాదని సిటీ ఎమ్మెల్యేలు ఇంటర్నల్ గా చెబుతున్నారట. అసలే సమ్మర్ సీజన్ కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం జనాన్ని తరలించడం అంత ఈజీ కాదని అంటున్నారంట. ఐతే ఏ గ్రామం నుంచి ఎంత మంది వస్తారో ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుని,..వచ్చే వాళ్లు చేజారిపోకుండా సభకు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారట గులాబీ లీడర్లు.
10 లక్షల మందితో వరంగల్ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్.. జనసమీకరణ బట్టే నియోజకవర్గాల్లో నాయకుల సత్తా ఏంటో తెలుస్తుందని చెప్తున్నారంట. రాబోయే రోజుల్లో పార్టీ పదవులు, ఎన్నికల్లో టిక్కెట్లు, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే వరంగల్ సిల్వర్ జూబ్లీ సభకు భారీ ఎత్తున జనాన్ని తరలించి తమ సత్తా చాటుకోవాలని నేతలు ప్రయత్నిస్తున్నారంట. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ ను పార్టీ నేతలు రీచ్ అవుతారా లేదా అన్నది తెలియాలంటే ఈనెల 27 వరకు ఆగాల్సిందే.