Minister Harish Rao : గజ్వేల్ నియోజకవర్గంలో హరీశ్ రావు రోడ్ షో.. ఈటలపై సంచలన వ్యాఖ్యలు
గజ్వేల్ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం, గజ్వేల్ లో అభివృద్ధి ఎవరితో జరిగిందో ప్రజలే ఆలోచన చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
- Harishth Thanniru
- Published On : November 20, 2023 / 04:43 PM IST
Minister Harish Rao
Telangana Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్, ములుగు మండల కేంద్రాల్లో కేసీఆర్ కు మద్దతుగా మంత్రి హరీశ్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం, గజ్వేల్ లో అభివృద్ధి ఎవరితో జరిగిందో ప్రజలే ఆలోచన చేయాలని సూచించారు. ఈటెల రాజేందర్ ఏదైనా పండుగకు, సావుకి వచ్చినోడా అని హరీశ్ రావు ప్రశ్నించారు. గజ్వేల్ లో మొదటి కరోనా వస్తే నేను వచ్చాను.. ధైర్యం ఇచ్చాను. నర్సారెడ్డి వచ్చిండా? ఈటల వచ్చిండా? అంటూ ప్రశ్నించారు. మన కష్టాలను తీర్చిన వారికి అండగా ఉందామని ప్రజలకు హరీశ్ రావు సూచించారు.
Alos Read : Karimnagar : కేసీఆర్ ఎన్నికల ప్రచార రథంలో తనిఖీలు.. సహకరించిన గులాబీ బాస్, సిబ్బంది
బీజేపోడిని చీపురు కట్టతో తరమండి, పాల మీద జీఎస్టీ వేసి ఏ మొఖం పెట్టుకొని బీజేపోడు మీ దగ్గరకి వస్తుండు అంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గెలవంగానే రూ. 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. తెలంగాణలో 24గంటల విద్యుత్ ఇస్తున్నాం. కర్ణాటకలో కరెంట్ తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు నాలుగు గంటల కరెంటే ఇస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ కావాలా.. కాంగ్రెస్ కావాలా మీరే తేల్చాలి. ప్రభుత్వం భూములను తీసుకుంటుందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వచ్చాక భూములకు విలువ పెరిగింది. కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములను పట్టాజేస్తాం. రేషన్ షాపుల్లో ముక్కిన బియ్యం కాదు సోనమసూర్ బియ్యం పంపుతాం. జనవరి నెలలోనే మొదటి విడత గృహ లక్ష్మి నిధులు పంపిణీ చేస్తామని హరీశ్ రావు చెప్పారు.
పోయినసారి రాష్ట్రంలో బీజేపోళ్లు ఒక్కటి గెలిచారు. బీజేపీ అధికారంలోకి వస్తదా..? ఈ బంగ్లాలకు కనీసం సున్నం వేస్తారా? వాళ్లు వంద అబద్ధాలు ఆడి గెలవాలని చూస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. నేను మాట ఇస్తున్న.. మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాం. మన గజ్వేల్ అభివృద్ధికోసం మన కేసీఆర్ కు ఓటేద్దామని హరీశ్ రావు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
