Lok Sabha Elections 2024: మెజార్టీ స్థానాల్లో కొత్తవారికే అవకాశం ఇవ్వనున్న కేసీఆర్?

Lok Sabha Elections 2024: దీంతో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో అన్నది ఆసక్తి రేపుతోంది.

BRS Chief KCR

పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంపీ అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తే చేస్తోంది బీఆర్ఎస్. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కొత్తవారిని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు జంప్ అయ్యారు. మరో ముగ్గురు ముగ్గురు ఎంపీలు కూడా పార్టీ మారుతారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు 16 సీట్లలో మెజార్టీ స్థానాల్లో కొత్తవారికే అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నారు గులాబీబాస్.

గత లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది లోకసభ స్థానాలను గెలుచుకుంది. అందులో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ నేతకానీ వెంకటేశ్ కాంగ్రెస్ లోకి, నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లారు. మరో ముగ్గురు ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, మాలోతు కవిత కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

మెదక్, మహబూబ్ నగర్లలో సిట్టింగ్ ఎంపీలకు పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బీఆర్ఎస్ రంగంలోకి దించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ స్థానాల్లో కూడా మెజార్టీ సీట్లలో కొత్తవారికే అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తుంది బీఆర్ఎస్ అధిష్టానం.

ఈ రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులపై
ఆర్థికంగా బలంగా ఉండి పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలపై పార్టీ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచేందుకు సుముఖంగా లేనన్న సంకేతాలను ఇస్తున్నారు. మల్కాజిగిరిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి టికెట్ రేస్ లో ఉన్నా తాజాగా పోటీలో ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులపై పార్టీ దృష్టిపెట్టింది బీఆర్ఎస్.

మల్కాజ్ గిరి, చేవేళ్ల ఎంపీ స్థానాల్లో ఓ సీటు బీసీ నేతకు ఇచ్చే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజికవర్గానికి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజికవర్గానికి టికెట్ కేటాయించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ లేదా అతని కొడుకు కాసాని వీరేశ్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ రెండింట్లో లో ఏసీటు ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ పెద్దలను కోరారు.

కడియం శ్రీహరి కూతురు పోటీ?
మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి గాలి అనిల్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. వరంగల్ లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను రంగంలోకి దించే ఛాన్సుంది. మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి సోదరుడి తనయుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆసీటులో కూడా కొత్త నేతను రంగంలోకి దించాలని పార్టీ భావిస్తోంది. దివంగత గాయకుడు సాయిచంద్ సతీమణి రజనీ లేదా విద్యాసంస్థల అధినేత రవికుమార్ మహబూబ్ నగర్ సీటు ఆశిస్తున్నారు.

అయితే పార్టీ అవకాశం ఇస్తే మళ్ళీ పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. దీంతో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో అన్నది ఆసక్తి రేపుతోంది. నాగర్ కర్నూల్ లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి లైన్ క్లియర్ అయినట్లేనని అంటున్నారు. నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరిలో గుత్తా అమిత్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖమ్మంలో నామా,మహబూబాబాద్ లో కవిత పార్టీ మారుతారనే వార్తలతో కొత్త నేతల ఎంపికపై దృష్టి సారించింది. కరీంనగర్ నుంచి బోయిన్ పల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను దాదాపు ఖరారు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం.

Narendra Modi: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణకు మోదీ.. షెడ్యూల్ ఇదే..

ట్రెండింగ్ వార్తలు