Telangana Election 2023 Nota votes : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 39 స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో విజయం సాధించారు. మజ్లిస్ ఏడు స్థానాల్లో, సీపీఐ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలయ్యాడు. ఈ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అత్యధికంగా 85వేల మెజార్టీ వచ్చింది.
Also Read : Telangana Congress : ఇవాళ సీఎల్పీ సమావేశం.. సాయంత్రమే సీఎం ప్రమాణ స్వీకారం!
పార్టీల వారిగా ఓటింగ్ శాతం ఇలా..
పార్టీల వారిగా ఓట్ల శాతం చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 39.40శాతం, బీఆర్ఎస్ పార్టీకి 37.35శాతం, బీజేపీకి 13.90శాతం, ఏఐఎంఐఎంకు 2.22శాతం, సీపీఐ పార్టీకి 0.34శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన బీఎస్పీ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. మొతత్ం 106 స్థానాల్లో అభ్యర్థులను నిలిపినా ఒక్కచోటా విజయం సాధించలేకపోయింది. కేవలం 1.37 ఓటు శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సైతం సిర్పూర్ లో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. మిగిలిన పార్టీలైన ఏఐఎఫ్బీ 0.62శాతం, సీపీఎం 0.22శాతం, ఇతరులు 3.84శాతం ఓట్లు పోలయ్యాయి.
నోటాకు తగ్గిన ఓట్లు
ఈదఫా ఎన్నికల్లో నోటాకు ఓట్లు తగ్గాయి. రాష్ట్రంలో్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు 1,68,256 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో 0.73శాతం ఓట్లు నోటాకు వచ్చాయి. అత్యధికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 4,079 ఓట్లు రాగా, జుక్కల్లో 469 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో నోటాకు 2,24,709 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా 56,453 ఓట్లు తగ్గడం విశేషం.