నిండిన హుండీలు, కానుకలు ఎక్కడ వేయాలి ? భక్తుల తికమక

Vemulawada : వేములవాడ రాజన్న భక్తులకు చిల్లర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కానుకలు చెల్లించుకునే దారి తెలియక భక్తజనం ఇబ్బందులు పడుతోంది. హుండీలు నిండుకోవడంతో మొక్కులు చెల్లించుకునే దారి తెలియక తికమకపడుతోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీలు నిండిపోయాయి. కార్తీక మాసంలో వివిధ ప్రాంతాల నుంచి వేములవాడ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో అధిక మొత్తంలో కానుకలు, ముడుపులు హుండీ చేరాయి. అయితే భక్తులు సమర్పించే కానుకల్లో కరెన్సీ కంటే ఎక్కువగా చిల్లర కాయిన్స్ ఉండటం కొత్త ఇబ్బందికి దారి తీసింది.
చిల్లర నాణేలను స్థానిక బ్యాంకులు డిపాజిట్ చేసుకునేందుకు విముఖత చూపాయి. దీంతో చిల్లరంతా హుండీల్లోనే ఉండిపోవడంతో అవి నిండిపోయాయి. ఇక చేసేదేమి లేక ఆలయ అధికారులు హుండీలను సీజ్ చేశారు. దీంతో కోడె మొక్కుల రాజన్నకు ముడుపులు సమర్పించేందుకు వస్తున్న భక్తులు.. వారి కానుకలు ఎక్కడ సమర్పించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఏటా హుండీల ద్వారా రాజన్న ఆలయానికి 18 కోట్ల ఆదాయం వస్తే.. 2కోట్ల వరకు చిల్లర నాణేలు వస్తాయంటున్నారు అధికారులు. చిల్లర కాయిన్స్తో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. దీనిపై త్వరలోనే పరిష్కారం కనుగొంటామని చెబుతున్నారు.