“ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం ప్రారంభం.. దీని ప్రయోజనాలు ఏంటి? లబ్ధిదారులు ఎవరు?
అదనంగా వచ్చే సౌర విద్యుత్ను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పారు.

CM Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా పాల్గొన్నారు. అలాగే, గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు.
కాగా, రూ.12,600 కోట్లతో ఇందిర సౌర గిరి జల వికాస పథకాన్ని చేపట్టారు. లబ్ధిదారులతో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయం కోసం సౌర విద్యుత్ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అదనంగా వచ్చే సౌర విద్యుత్ను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పారు. సౌర విద్యుత్ వినియోగంపై గిరిజనులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం ద్వారా గిరిజన రైతుల భూములకు విద్యుత్, సాగునీటి సౌకర్యాలు కల్పిస్తారు.
Also Read: పాతబస్తీ అగ్నిప్రమాదం: హృదయ విదారకం.. ఒకేసారి మంటల్లో కాలిపోయిన మూడు తరాలవారు
ఇటీవల ఈ పథకం గురించిన వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములన్నింటినీ సాగులోకి తీసుకురావాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని అన్నారు.
ఇందుకోసం తాము రూ.12,600 కోట్లతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. 2.10 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో 6 లక్షల ఎకరాల్లో సాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఇందిర సౌర గిరి జల వికాస పథకం కింద గ్రామాల్లో జల వనరుల కోసం జియోలాజికల్ సర్వే, సోలార్ పంపుసెట్లు బిగించడం, బోర్లు వేయడం,ప్లాంటేషన్, డ్రిప్ ఏర్పాటు వంటి పనులు చేపడుతుందని అన్నారు. ఈ పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు, ఉద్యాన శాఖ, విద్యుత్తు అధికారుల పాత్ర కీలకమని వివరించారు.
ఇవాళ సీఎం ఏమన్నారు?
సోలార్ పంపుసెట్లతో పాటు పొలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించి అదనపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. పరిసర ప్రాంతాల గిరిజనులకు లబ్ధిదారులు పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సోలార్ విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వంద రోజుల్లో రైతులందరి పొలాల్లోల సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.