YS Sharmila: తెలంగాణలో కొత్త పార్టీ అయినప్పటికీ ప్రజల్లో అభిమానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో పలు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ నిరుద్యోగులకు ధైర్యం చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్షను విరమించారు.
ఆ తర్వాత గతంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుద్యోగుల పక్షాన వైతెపా పోరాటం చేస్తుందంటూ హామీ ఇచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగులంతా పోటీ చేయాలన్నారు. వీలైనంత ఎక్కువ మంది నిజామాబాద్ మాదిరిగా నామినేషన్లు వేయాలని కోరారు.
ఈ ప్రయత్నంలో భాగంగా పార్టీ తరఫున ఆర్థికంగా సాయం అందిస్తామని షర్మిల వెల్లడించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు షర్మిల.