పెళ్లి పీటలెక్కుతున్న వైసీపీ ఎంపీ

అంచనాలకు మించి సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటిన విశాఖ జిల్లా అరకు ఎంపీ, వైసీపీ నాయకురాలు గొడ్డేటి మాధవి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అక్టోబర్ 17న తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో ఆమె వివాహం జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.
అనంతరం విశాఖలో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు ఎంపీ సోదరులు తెలిపారు. ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అంతేకాదు ఆమెది కులాంతర వివాహమని తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశంలోని ఎంపీలు అందరిలోకి అత్యంత తక్కువ ఆస్తి కలిగిన ఎంపీగా మాధవి రికార్డులకు ఎక్కారు. ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఎంప్లాయ్గా, పీఈటీ ఉపాధ్యాయురాలిగా తన ప్రస్థానం ప్రారంభించిన మాధవి తర్వాతికాలంలో వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సార్వత్రిక ఎన్నికల్లో మాధవికి అరకు లోక్సభ స్ధానం కేటాయించగా ఆమె విజయం సాధించారు.
అంతేకాదు పార్లమెంట్లో అడుగుపెట్టిన ఎంపీల్లో అతి పిన్న వయస్కురాలు మాధవినే. పాతికేళ్లకే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మాధవి తండ్రి గొట్టేడి దేముడు గతంలో ఎమ్మెల్యేగా గెలవగా.. వామపక్ష పార్టీల్లో కీలక నేతగా ఎదిగారు. విశాఖ జిల్లా చింతపల్లి, పాడేరు నియోజకవర్గాల నుంచి మాధవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గొడ్డేటి మాధవి గిరిజన కమ్యూనిటీకి చెందిన మహిళ కావడంతో వారి సాంప్రదాయం ప్రకారమే వివాహాం జరగనుంది.