తండ్రి వైఎస్ చదివిస్తే..తనయుడు జగన్ జాబ్ ఇచ్చారు

తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చదివిస్తే..నేడు ఆయన కొడుకు జగన్..తమకు ఉద్యోగాలు ఇచ్చారని నూతనంగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులు కొనియాడారు. అక్టోబర్ 2వ తేదీ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని కరపలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా సచివాలయ ప్రాంగణంలో పైలాన్ను ఆవిష్కరించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఎంపికైన కొంతమంది ఉద్యోగులు మాట్లాడారు.
గత ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం జగన్ ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోందన్నారు. సీఎం జగన్ విప్లవ సృష్టికర్త అంటూ కొనియాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమయినా..తమకు ప్రభుత్వాలకు అవకాశం కల్పించలేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 పట్టణ సచివాలయాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. గ్రామ సచివాలయాలకు సంబంధించి లక్షా, 26,728మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే బుధవారం నుంచి మండలానికి ఒక గ్రామ సచివాలయం మాత్రమే అందుబాటులోకి రానుంది. నవంబర్ నాటికి గ్రామ, పట్టణ సచివాలయాల్లో సదుపాయాలన్నీ కల్పించి డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో పని చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.