ఏపీ ‘రైతు రక్ష’ : ఆటో, ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ రద్దు

అమరావతి : ఆటో, ట్రాక్టర్ల యజమానులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్నును రద్దు చేస్తూ జీవో జారీ చేయనుంది. అలాగే, రైతులు, కౌలు రైతులకు మేలు జరిగేలా మరో పథకాన్ని కూడా ఈ ఖరీఫ్ నుంచి అమలు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. దీనికి ‘రైతు రక్ష’ అనే పేరును కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది లబ్ది పొందనున్నారు.
ట్రాక్టర్ రైతు జీవితంలో ఓ భాగం..పొలంలో పంట వేయాలంటే ట్రాక్టర్ వుండాల్సిందే. ట్రాక్టర్ తో రైతు జీవితం ముడిపడి వుంది. పొలం దున్నే నాటి నుండి పండిన పంట ఇంటికి చేరేంత వరకూ రైతుకు ట్రాక్టర్ అంతగా ముడిపడి వుంటుంది. అలాగే స్వతంత్రంగా జీవించేందుకు ఆటోలు నడుపుకుంటు స్వయం ఉపాధి పొందేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే అనుకోవచ్చు. ఒక పక్క కౌలు రైతులుగా పొలం సాగుచేసుకుంటు మరోపక్క స్వయం ఉపాధిగా ఆటోలు నడుపుకుంటుంటారు చాలామంది మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు. ఈ క్రమంలో ఆటో, ట్రాక్టర్స్ పై ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ ఎత్తివేసే నిర్ణయంతో మరింతగా వారి జీవనం మెరుగు పడే అవకాశముంది.