లంచం డబ్బులు తిరిగిచ్చెయ్…నిరసన చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులను నిలదీసిన ప్రజలు

సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్రెడ్డి, గౌతమ్కుమార్ పిలుపునిచ్చారు. తహసీల్దార్ను దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ(నవంబర్-5,2019) నిరసన చేపట్టిన భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకు దిగిన సిబ్బందిని అక్కడి ప్రజలు నిలదీశారు. అన్నీ పత్రాలు సక్రమంగా తమ పనులు చేయడానికి కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో తన దగ్గర రూ.2 వేలు లంచం తీసుకున్నాడంటూ ఓ మహిళ రెవెన్యూ ఉద్యోగిని నిలదీసింది. తన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే గల్లా పట్టి వసూలు చేస్తానని హెచ్చరించింది. ఈవ్యవహారమంతా వీడియో రికార్డింగ్ అవుంతోందని గ్రహించిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు బంధువులు, ఉద్యోగులు, స్థానికుల అశ్రునయనాల మధ్య నాగోల్ స్మశాన వాటికలో ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.