గోదావరి జలాలతో అభిషేకం..మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం
ఆదిలాబాద్ ఆదివాసీల నాగోబా జాతర సంబురాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నెలల ప్రకారం పుష్య మాసాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు తమ కుల దైవాలను కొలుచుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అడవుల జిల్లాగా పేరొందిని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతర శుక్రవారం (జనవరి 24,2020) అర్ధరాత్రి ప్రారంభంకానుంది.
మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకొని కాలినడకన నాలుగు రోజుల కిందట కెస్లాపూర్కు చేరుకున్నారు. నాగోబా ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్ల కింద వారు సేదతీరారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మెస్రం వంశీయుల ప్రత్యేక పూజల అనంతరం జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో కీలకమైన ప్రజాదర్బార్ ఈనెల 27న జరుగనుండగా.. మంత్రులు, కలెక్టర్, వివిధశాఖల అధికారులు హాజరై గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపడం ఇక్కడి ప్రత్యేకత. కాగా..ఈ నాగోబా జాతరు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు ఆదివాసీయులు.