మేడిన్ ఏపీ.. రాష్ట్రంలోనే కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తయారీ

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం,

  • Published By: veegamteam ,Published On : April 8, 2020 / 10:10 AM IST
మేడిన్ ఏపీ.. రాష్ట్రంలోనే కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తయారీ

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం,

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం, బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందించడం వంటివి చేస్తోంది. ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోనే కరోనా టెస్టింగ్ కిగ్లు, వెంటిలేటర్లు తయారీ చేస్తున్నారు. దేశంలో ఇలా ఎక్కడా లేదని, కేవలం ఏపీలోనే కరోనా టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 

రోజూ 3 నుంచి 4వేల కరోనా పరీక్షలు:
ఏప్రిల్ నెలాఖరుకి రాష్ట్రంలో రోజు 3 నుంచి 4 వేల పరీక్షలు చేసేలా కిట్లు తయారు చేస్తున్నామన్నారు. బుధవారం(ఏప్రిల్ 8,2020) సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కరోనా టెస్టింగ్‌ కిట్లను ప్రారంభించనున్నారని తెలిపారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా కిట్లు సరఫరా అవుతాయన్నారు. టీబీ మెషిన్లకు అమర్చుకునేలా కిట్లను తయారు చేస్తున్నామని.. దీని వల్ల త్వరగా టెస్టింగ్‌ కిట్లను అమర్చుకోవచ్చని వెల్లడించారు.

విశాఖలో వెంటిలేటర్ల తయారీ:
మొట్టమొదటి ఇండియన్‌ మేడ్‌ వెంటిలేటర్లను కూడా విశాఖలో తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్‌టెక్‌ జోన్‌కు నిధులిచ్చి సీఎం అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ముందు చూపు వల్ల ఈ రోజు కిట్లు తయారు చేయగలిగామని, సీఎం జగన్‌ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని ప్రశంసించారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకండా అన్నిచర్యలు తీసుకుంటున్నామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

ఒక్కో కిట్‌ ద్వారా రోజుకు 20 టెస్టులు, 50 నిమిషాల్లోనే రిపోర్టు:
కరోనా నియంత్రణ చర్యలు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌ పాల్గొన్నారు. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో మెడికల్ కిట్లు, వసతుల కొరత లేకుండా చూడాలన్నారు. కాగా, కరోనా పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం 1000 ర్యాపిడ్‌ కిట్స్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసందే. పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో ఈ కిట్స్‌ను తయారు చేశారు. 50 నిమిషాల్లోనే ఒక టెస్టింగ్‌ రిపోర్ట్‌ వస్తుంది. ఒక్కో కిట్‌ ద్వారా రోజుకు 20 టెస్టులు నిర్వహించవచ్చు.
 

ఏపీలో 329కి చేరిన కరోనా కేసులు:
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులపై తాజాగా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 

రాష్ట్రంలో మొదలైన కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి:
రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, అది ప్రాథమిక స్థాయిలో ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ లు చేసేందుకు ఆరోగ్యశాఖ రెడీ అవుతోంది. ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక సర్వే ద్వారా కరోనా లక్షణాలతో ఉన్న 5వేల మందిని గుర్తించారు. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని భావిస్తున్నారు. 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను దిగుమతి చేసుకుంటున్నామని,  రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ లు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకు ప్రైవేటు ల్యాబ్ లనూ సంప్రదిస్తున్నామన్నారు. (కరోనా చైన్ బ్రేక్…పెద్ద విజయం సాధించిన మధ్యప్రదేశ్ సిటీ)

40 లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్క్ లు, 20లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు:
టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయొచ్చని ఐసీఎంఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలో 240 ట్రూనాట్ సెంటర్లున్నాయి. 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్-95 మాస్కులు సిద్ధం చేస్తున్నారు. 40 లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్క్ లు ఉన్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్ 14 లక్షలు సిద్ధంగా ఉంచామని అని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.వెల్లడించారు.

* నెల్లూరు జిల్లాలో 49కి చేరిన కరోనా కేసులు
* కృష్ణా జిల్లాలో 35కి చేరిన కరోనా కేసులు
* చిత్తూరు జిల్లాలో 20కి చేరిన కరోనా కేసులు
* కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు నలుగురు మృతి
* రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారు ఆరుగురు