చట్టాల్లో కీలక సంస్కరణలకు సిద్దమైన మోడీ ప్రభుత్వం

చట్టాల్లో కీలక సంస్కరణలకు సిద్దమైన మోడీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో కీలక సంస్కరణలు రాబోతున్నాయి. బ్రిటీష్‌ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో సరికొత్తవాటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా భారత్‌లో బ్రిటీష్ కాలం నాటి చట్టాలే అమల్లో ఉన్నాయి.

ఈ చట్టాల్లో మార్పు తెచ్చే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా IPC, CRPC చట్టాల్లో మార్పు తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజంలోని కీలకమైన వ్యక్తులు, మేధావుల నుండి సలహాలు తీసుకోనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ముఖ్యంగా అత్యాచారం కేసుల్లో ప్రస్తుత చట్టాల్లో ఎన్నో లొసుగులున్నాయి. దీంతో ఐపీసీ చట్టంలో మార్పు తేవాలని కేంద్రం యోచిస్తోంది. నిర్భయ ఘటనలో శిక్ష అమలులో జాప్యం, దిశ ఎన్‌కౌంటర్‌ వంటి కేసులు చర్చకు దారి తీసాయి. ఈ నేపథ్యంలోనే IPC, CRPC చట్టాల్లో మార్పు తేవాలని చూస్తోంది. వీటితో పాటి మిగిలిన కాలం చెల్లిన చట్లాలను కూడా సమూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.