విహారం విషాదం : బోటు ఎక్కడ ? 

  • Published By: madhu ,Published On : September 15, 2019 / 12:22 PM IST
విహారం విషాదం : బోటు ఎక్కడ ? 

తూర్పుగోదావరిలో తీవ్ర విషాదం నెలకొంది. విహారం విషాదాంతమైంది. కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పాపికొండల పర్యాటకానికి వెళ్లిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ బోటుకు పర్యాటక అనుమతి లేదని అధికారులు నిర్ధారించారు. NDRF బృందాలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

అయితే..బోటు ఎక్కడున్నది మాత్రం తెలియరావడం లేదు. రెండంతస్తులున్న బోటు పక్కకు ఒరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. కింద ఎసీ, పైనా నాన్ ఎసీ సౌకర్యం ఉందని సమాచారం. బోల్తా కొట్టడంతో పైన ఉన్న వారు..బోటుపైకి ఎక్కినట్లు వెల్లడించారు. దీంతో ఏసీలో ఉన్న వారు అందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయం వారికి తెలియకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం బోటులో 71 మంది ఉన్నారు. బోటు ఆచూకి తెలిస్తే..మృతదేహాలు బయటపడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే..సాయంత్రం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. 

బోటు మునక తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బోటులో 29 మంది తెలంగాణ వాసులున్నారు. ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నా బోటుకు ఎలా అనుమతినిచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. యజమానుల ధనదాహం పర్యాటకుల ప్రాణాలకు మీదకు తెచ్చింది. 71మంది కేవలం 24 మంది బయటపడడం..మిగతా వారి పరిస్థితి ఏంటో ఆందోళన నెలకొంది. వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 
Read More : బోటు మునక : 14 మంది వరంగల్ వాసులు..5గురు సేఫ్