మెట్రో పరుగులు : ప్రయాణీకులు తెలుసుకోవాల్సిన విషయాలు
దేశ వ్యాప్తంగా మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు ఐదున్నర నెలల తర్వాత మెట్రో మళ్లీ కూతపెట్టనుంది. హైదరాబాద్లోనూ 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం మెట్రోరైల్ పరుగుపెట్టనుంది.
భాగ్యనగరంలో మెట్రోసేవలు దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. తొలుత మియాపూర్ టు ఎల్బీ నగర్ రూట్లో మెట్రో సర్వీసులను పునరుద్ధరిస్తారు. ఉదయం 7 గంటలకు మెట్రో సర్వీసులు ప్రారంభమవుతాయి.
ఇక మంగళవారం… నాగోల్ – రాయదుర్గం రూట్లో సర్వీసులు నడుపుతారు. సెప్టెంబర్ 9 ఎంజీబీఎస్ టు పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో మెట్రోసేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ మూడు రోజులు మెట్రోరైళ్ల పని వేళల్లోనూ స్వల్ప మార్పులు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయి.
మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. మెట్రోరైల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించి తీరాల్సిందే. మెట్రో స్టేషన్ ప్రవేశ మార్గాల దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.
https://10tv.in/centre-informs-sc-moratorium-period-capable-being-extended-upto-two-years/
ఫేస్ మాస్క్ తప్పనిసరి. మాస్క్లేని వారిని స్టేషన్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. మాస్క్లు స్టేషన్లలో అందుబాటులో ఉంచనున్నారు. నార్మల్ టెంపరేచర్ ఉంటనే లోనికి అనుమతిస్తారు. మెట్రో స్టేషన్లోనూ, రైలులోనూ ప్రయాణించే సమయంలో ప్రయాణికులంతా సామాజిక దూరం పాటించాలి.
సీటింగ్ విషయంలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కో సీటు గ్యాప్ ఇస్తూ కూర్చునేలా రూల్స్ తీసుకొచ్చారు మెట్రో అధికారులు. ప్రయాణికులు నిల్చునేందుకు వీలుగా పుట్ ప్రింట్స్ వేశారు. ప్రింట్ వేసిన దగ్గరే నిల్చోవాలంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో ప్రతి కోచ్లో కేవలం 100 మంది మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది.
మెట్రో రైల్ టికెటింగ్ విధానంలోనూ అధికారులు మార్పులు చేశారు. ఒకేసారి ఐదుగురికి టికెట్స్ ఇచ్చేలా కొత్త సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు.. క్యాష్లెస్ పద్ధతిలో టిక్కెట్లను విక్రయిస్తారు. గతంలో ఉన్న టోకెన్ సిస్టమ్ను రద్దు చేశారు. నగదు రహిత రూపంలో ఆన్లైన్, స్మార్ట్కార్డ్, క్యూఆర్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి వాడి పడేసేలా పేపర్ టికెట్ను ప్రయాణికులను ఇవ్వనున్నారు.
ప్రయాణికులు మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్తో రావాల్సి ఉంటుంది. మరోవైపు మెట్రో ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేయనున్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో అన్ని స్టేషన్లను క్లీన్ చేస్తారు. లిఫ్ట్ బటన్లు, ఎస్కలేటర్లు, ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తరచూ శుభ్రంపరుస్తారు.
ఇక కంటైన్మెంట్ జోన్లలో ఉన్న స్టేషనల్లో మెట్రో రైళ్లను ఆపవద్దని అధికారులు నిర్ణయించారు. దీంతో గాంధీ ఆస్పత్రి, భరత్నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుఫ్గూడ మెట్రో స్టేషన్లలో రైళ్లు ఆగవు. ఆ స్టేషన్లను పూర్తిగా మూసే ఉంచుతారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర కూడా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికులంతా దిగిపోయాక కోచ్ మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నారు. సీట్లు, హ్యాండ్లర్స్ని శానిటైజ్ చేసి శుభ్రపరచనున్నారు. ప్రతి ట్రిప్కు శానిటైజ్ చేసిన తర్వాతే ట్రైన్ బయల్దేరనుంది.