Gujarat Polls: కాంగ్రెస్ నేతల మధ్య ఆ పోటీ ఉంటది.. కాంగ్రెస్ విమర్శలపై ప్రధాని మోదీ కౌంటర్
గుజరాత్ నాకిచ్చిన బలం కాంగ్రెస్ పార్టీని చాలా బాధపెట్టింది. ఒక కాంగ్రెస్ నేత ఇక్కడికి వచ్చి నా సామర్థ్యం ఏంటో చూస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరో ఏవేవో అన్నారు. నన్ను ఇంకా తిట్టించడానికి, ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఖర్గేను ఇక్కడికి పంపారు. నేను ఖర్గేను చాలా గౌరవిస్తాను
Gujarat Polls: తనను తిట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పోటీ ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తనను ఎవరు ఎంత ఎక్కువగా తిడితే కాంగ్రెస్ పార్టీలో వారికి అంత పెద్ద పదవులు వస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనను రావణుడు అని వ్యాఖ్యానించడంపై మోదీ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత మాట్లాడుతూ మోదీ కుక్క చావు చస్తారని అన్నారు. ఇంకొకరు మోదీని హిట్లర్తో పోల్చారు. ఒకాయనైతే నాకే అవకాశం దొరికితే మోదీని నా చేతులతోనే చంపేస్తానని అన్నారు. ఇంకొకరు రావణుడు అన్నారు, మరొకరు రాక్షసుడు అన్నారు. మరొకాయన బొద్దింక అన్నారు.. నాకు అర్థం కావడం లేదు. ఒక్క మోదీకి ఇన్ని పేర్లా? మోదీని అవమానించడానికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పోటీ నడుస్తోంది. కానీ ఈ దేశ ప్రధానమంత్రిని అంటున్నామని వారు గుర్తించడం లేదు’’ అని అన్నారు.
ఆదివారం అహ్మదాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ ‘‘నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాదు, ఆయన ప్రచార మంత్రి. బహుశా ఆయనను ఎన్నికల ప్రచార మంత్రిగా నియమించాలి. ఎందుకంటే, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ కనిపిస్తారు. కార్పొరేషన్ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికలో మోదీ కనిపిస్తారు. అంతటా ఆయన గురించి ఆయనే చెప్పుకుంటారు. మోదీని ఓటును చూసినంత బాగా మీరు ఇంకెవరినీ చూడలేరు (ర్యాలీకి వచ్చిన ప్రజలను ఉద్దేశించి). ఎన్నిసార్లు మీరు మోదీ ముఖాన్ని చూసుంటారు? బహుశా మీ ముఖాన్ని మీరు కూడా అన్నిసార్లు చూసుకుని ఉండరు. మీకేమైనా రావణుడిలా 100 తలలు ఉన్నాయా? (మోదీని ఉద్దేశించి)’’ అని అన్నారు. ఇక క్రికెట్ స్టేడియానికి నరేంద్రమోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత మధుసూదన్ మిస్త్రీ స్పందిస్తూ ‘‘మోదీ సామర్థ్యమేంటో మేము చూడాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
కాగా ఖర్గే, మిస్త్రీ వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ ‘‘గుజరాత్ నాకిచ్చిన బలం కాంగ్రెస్ పార్టీని చాలా బాధపెట్టింది. ఒక కాంగ్రెస్ నేత ఇక్కడికి వచ్చి నా సామర్థ్యం ఏంటో చూస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరో ఏవేవో అన్నారు. నన్ను ఇంకా తిట్టించడానికి, ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఖర్గేను ఇక్కడికి పంపారు. నేను ఖర్గేను చాలా గౌరవిస్తాను. కానీ ఆయనకు ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. గుజరాత్ రామ భక్తుల రాష్ట్రమని కాంగ్రెస్ పార్టీకి తెలియదు. అందుకే మోదీని 100 తలల రావణుడితో పొలుస్తున్నారు’’ అని అన్నారు.