లాక్డౌన్ 4: మే 18 నుంచి.. కొత్తగా అమలు
లాక్డౌన్ అమలుపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 21వ శతాబ్ధపు ఆకాంక్షలకు తగినట్లు ప్యాకేజీ రూపకల్పన చేసినట్లు చెప్పిన మోడీ కరోనాపై సుదీర్ఘ యుద్ధం తప్పదని అన్నారు. నాలుగు నెలలుగా మహమ్మారితో ఒకవైపు యుద్ధం చేస్తూనే, మరోవైపు అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు.
దేశం కోసం పోరాటం చెయ్యాల్సిన బాధ్యతను 130 కోట్ల మంది తలకెత్తుకోవాలని సూచించారు మోడీ. ఇక మే 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుండగా, మే 18 నుంచి లాక్డౌన్ నాల్గవ దశ కొత్త రూపు రానుందని అన్నారు. లాక్ డౌన్-4లో కూడా అన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిద్దామని వెల్లడించారు మోడీ.
అయితే ఈ నాలుగో విడత లాక్డౌన్లో కొన్ని కొత్త అంశాలు చేరనున్నట్లు ఆయన చెప్పారు. వాటిని మే 18కి ముందు ప్రకటిస్తామని అన్నారు. అలాగే భారత్లో స్థానిక వస్తు వినియోగం పెరగాలని, మనవాళ్ల నుంచే వస్తువులు కొనుగోలు, అమ్మకాలు జరగాలని అన్నారు. మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియాను జనాల్లోకి తీసుకుని వెళ్లాలని అన్నారు.