Umar Khalid: జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ జైలుకు వెళ్లి 1,000 రోజులు పూర్తి
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో 3 హత్య కేసులకు సంబంధించిన అభియోగపత్రాలను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసింది. ఈశాన్య ఢిల్లీలోని కర్దంపురి, మౌజ్పూర్ చౌక్ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి.
Delhi Riots: ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన జవహార్లాల్ నెహ్రూ విద్యార్థి నేత జైలుకు వెళ్లి నేటితో 1,000 రోజులు పూర్తైంది. అటు ఇటుగా మూడేళ్ల క్రితం 2020లో సెప్టెంబర్ 14న అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సాక్ష్యాలను విచారించిన కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. పలు సందర్భాల్లో బెయిల్ కోసం ఉమర్ ఖలీద్ పెట్టుకున్న అభ్యర్థనలు తిరస్కారానికి గురయ్యాయి. ఇదిలా ఉంటే.. ఉమర్ ఖలీద్ను వెయ్యి రోజులుగా జైళ్లో వేయడంపై సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఖలీద్ 1,000 రోజుల జైలు శిక్ష 1,000 రోజుల ప్రతిఘటనకు సమానం’’ అని అన్నారు.
ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అల్లర్లతో ఆయనకు సంబంధం ఉందంటూ పోలీసులు పేర్కొన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలతో పాటు యూఏపీఏ సెక్షన్ల కింద ఉమర్ ఖలీద్ను స్పెషల్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. షహీన్ బాగ్ నిరసనల నేపథ్యంలో ఈయన విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలోనే పోలీసులు ఆయన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. జైలు జీవితం గడుపుతూనే పలు సందర్భాల్లో ఉమర్ ఖలీద్ కోర్టు ముందు హాజరయ్యారు. అయితే తనకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టిస్తున్నారని అతడి తరపు న్యాయవాది 2021 సెప్టెంబరులో ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఉమర్ వద్ద తీసుకున్న స్టేట్మెంట్ ఆధారంగా కోర్టు ముందు ఆయన వానదలు వినిపించారు. అయితే వీటిని కోర్టు తోసిపుచ్చింది.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో 3 హత్య కేసులకు సంబంధించిన అభియోగపత్రాలను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసింది. ఈశాన్య ఢిల్లీలోని కర్దంపురి, మౌజ్పూర్ చౌక్ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. హింసాత్మక సంఘటనల వెనుక లోతైన కుట్ర ఉందని, దానివల్ల మతపరమైన అల్లర్లు జరిగాయని ఢిల్లీ పోలీసు అదనపు పీఆర్ఓ అనిల్ మిట్టల్ అప్పట్లో అన్నారు. కుట్రదారులు, అల్లర్లకు పాల్పడినవారు పౌరసత్వ సవరణ చట్టం, చక్కాజామ్లపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని, దానివల్ల మతపరమైన అల్లర్లు జరిగాయని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకిస్తున్నామనే ముసుగు వేసుకుని, దేశ పరువు ప్రతిష్ఠలకు మచ్చ తేవాలనే ఉద్దేశంతో కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఆ కేసులోనే ఉమర్ ఖలీద్ అరెస్ట్ అయ్యారు.