Highway Accidents and Deaths : హైవే ప్రమాదాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా?
హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియాలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో పాటు ట్రాఫిక్ చట్టాల అమలులో వైఫల్యం కూడా ఈ ప్రమాదాలకు కారణంగా కనిపిస్తోంది.
![Highway Accidents and Deaths : హైవే ప్రమాదాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా? Highway Accidents and Deaths : హైవే ప్రమాదాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా?](https://10tv.in/wp-content/uploads/2023/07/New-Project-7-27.jpg)
Highway Accidents and Deaths
Highway Accidents and Deaths : ప్రతి ఏటా భారత దేశంలో సుమారు 1.5 లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని మీకు తెలుసా? 2021 లో 4,12,432 ప్రమాదాలు జరిగితే 1,42,163 (34.5%) ప్రాణాంతకమైనవి కాగా.. 2,46,027 (59.7%) స్వల్ప గాయాలతో తప్పించుకున్నవి. ఈ లెక్కలు చూస్తుంటే భయం వేస్తోంది. ఒక ప్రమాదంలో మనిషి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి ఎంతటి తీరని నష్టమో ఊహించలేం.
ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా హైవేలపై జరిగిన ప్రమాద ఘటనలను తలచుకుంటే వణుకు పుడుతుంది. దేశంలోనే రెండవ అతి పొడవైన ఎక్స్ ప్రెస్ వే అయిన 701 కి.మీల రహదారిపై ప్రతి రోజు ఒక మరణం నమోదు అవుతోంది. ఇప్పటి వరకూ 620 ప్రమాదాలు జరిగితే 100 మందికి పైగా చనిపోయారు. కొద్దిరోజుల క్రితం అహ్మదాబాద్లో తెల్లవారు ఝామున జాగ్వార్ డ్రైవర్ 140 కి.మీల వేగంతో దూసుకొచ్చి జనంపైకి దూసుకెళ్లడంతో 9 మంది చనిపోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వే లో జనవరి నుంచి 296 ప్రమాదాలు జరిగితే 132 మంది చనిపోయారు.
64 లక్షల కిలోమీటర్ల రహదారి నెట్ వర్క్ ఉన్న ఇండియా దూరాలను తగ్గించింది కానీ.. రోడ్డు ప్రమాదాల కారణంగా జీవితాలు ప్రమాదంలో పడిపోతున్నాయి. అతి వేగం, ఆల్కహాల్ సేవించి నడపడం, రాంగ్ సైడ్ డ్రైవ్ చేయడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడంతో పాటు రోడ్లు గుంతలతో సరిగా ఉండకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ముంబయి-అహ్మదాబాద్ హైవేపై ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీతో పాటు తోటి ప్రయాణికుడు అతి వేగం, సీట్ బెల్ట్ ధరించని కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
డ్రైవర్ మానసిక స్థితి కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. డ్రైవర్ ఏకాగ్రతతో డ్రైవ్ చేయకపోవడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరోవైపు రహదారుల నిర్మాణంలో లోపాలతో పాటు ట్రాఫిక్ చట్టాలను సరిగా అమలు చేయకపోవడం కూడా మరో కారణం. చట్టానికి కట్టుబడి ఉండటం, కఠిన శిక్షలు, రహదారి భద్రతపై అవగాహనతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తే ఈ ప్రమాదాలను నివారించవచ్చు.