బీహార్ లో అంతే…కరోనా విజృంభిస్తున్నా ఎన్నికలపైనే చర్చలు
బీహార్ లోని నితీష్ సర్కార్ ఫై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫైర్ అయ్యారు. కరోనా మహమ్మారి ఓ వైపు దేశాన్ని వణికిస్తుంటే..నితీష్ సర్కార్ మాత్రం ఎన్నికల ప్రచారానికి తెరతీస్తున్నారంటూ ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. ఈ ఏడాది చివర్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
కాగా, బిహార్లో అతితక్కువగా టెస్ట్లు చేస్తున్నా 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో కరోనా వైరస్ నియంత్రణను పక్కనపెట్టి బిహార్లో ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారని పీకే విమర్శించారు. కరోనా వైరస్ భయంతో ఇంటికే పరిమితమైన నితీశ్కుమార్ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వస్తే.. ప్రజలు మాత్రం వైరస్కు గురికారని ఆలోచిస్తున్నారంటూ ఆదివారం ప్రశాంత్ కిశోర్ వరుస ట్వీట్లు చేశారు.
ప్రశాంత్ కిశోర్ కొంతకాలం పాటు నితీష్ కుమార్ నేతృత్వం లోని జనతాదళ్(యూ)లో పని చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించినా నితీశ్కుమార్ ఒక్కసారి కూడా మహమ్మారిపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.