Rahul Gandhi: తెలంగాణతో సహా ఆ మూడు రాష్ట్రాల్లో విజయం కాంగ్రెస్ పార్టీదే..
బీజేపీ వ్యూహాలతో ఎలా అప్రమత్తంగా ఉండాలో మేము నేర్చుకున్నాం. కర్ణాటకలో మేము స్పష్టమైన విజన్ ప్రజలకు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలుపై ప్రత్యేక దృష్టిసారించాం.
![Rahul Gandhi: తెలంగాణతో సహా ఆ మూడు రాష్ట్రాల్లో విజయం కాంగ్రెస్ పార్టీదే.. Rahul Gandhi: తెలంగాణతో సహా ఆ మూడు రాష్ట్రాల్లో విజయం కాంగ్రెస్ పార్టీదే..](https://10tv.in/wp-content/uploads/2023/09/Rahul-Gandhi.jpg)
Rahul Gandhi
Congress Party Leader Rahul Gandhi: తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఈ ఏడాది తాము అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకున్నామని రాహుల్ చెప్పారు. మా ప్రణాళికను అమలు చేయడానికి అనుమతించకుండా తమ దృష్టిని మరల్చడం ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుందని రాహుల్ అన్నారు. కానీ, కర్ణాటక ఎన్నికల్లో మేము బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టామని, వాళ్లు ఊహించని విధంగా ఎన్నికల్లో పోరాటం చేశామని రాహుల్ చెప్పారు.
Nara Brahmani : బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు .. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు
కుల గణన అనేది దేశంలోని ప్రజలు కోరుకునే ప్రాథమిక విషయం అని తెలుసు. పార్లమెంట్లో ఈ అంశంపై బీజేపీ చర్చకు కోరుకోదు. దీంతో మన దృష్టిని మరల్చడానికి మరో కొత్త అంశాన్ని తీసుకొస్తారు. అయితే, బీజేపీ ఈ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలో మేము నేర్చుకున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. ఎంపీలు రమేష్ బిధూరి, నిషికాంత్ దూబే ద్వారా వివాదాలు సృష్టించడం ద్వారా కుల గణన ఆలోచన నుంచి ప్రజలను మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
బీజేపీ వ్యూహాలతో ఎలా అప్రమత్తంగా ఉండాలో మేము నేర్చుకున్నాం. కర్ణాటకలో మేము స్పష్టమైన విజన్ ప్రజలకు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలుపై ప్రత్యేక దృష్టిసారించాం. వారు (బీజేపీ) ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు మా ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని రాహుల్ చెప్పారు. భారత్ జోడో యాత్రను అడ్డుకొనేందుకు బీజేపీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుచేసిందని రాహుల్ ఆరోపించారు. అయినా, పార్టీ శ్రేణులు, ప్రజల అండదండలతో భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేశామని రాహుల్ చెప్పారు.