Motkupalli Narasimhulu : చివరికి దేవాన్షును కూడా జగన్ అరెస్ట్ చేస్తాడేమో! చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మోత్కుపల్లి నిరసన దీక్ష
ఆ నాడు జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ విజయం సాధించాలని కోరుతూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందని మోత్కుపల్లి అన్నారు.
Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టు అనుమతితో రెండు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ అధికారులు చంద్రబాబును విచారిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆదోళనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ ఐటీ ఉద్యోగులు చలో రాజమహేంద్రవరం పేరిట కార్ల ర్యాలీ చేపట్టారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్యోగులు పరామర్శించనున్నారు. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరిన కార్లను ఏపీ – తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగిస్తానని మోత్కుపల్లి తెలిపారు. అయితే, పోలీసులు గంట మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. నిరసన దీక్ష ప్రారంభంకు ముందు మోత్కుపల్లి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నాడు జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ విజయం సాధించాలని కోరుతూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందని అన్నారు. కానీ, ఆ నాడు అలా మాట్లాడినందుకు ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటున్నానని మోత్కుపల్లి అన్నారు. గత ఎన్నికల్లో జగన్ విజయానికి సహకరించిన ప్రతీఒక్కరూ నేడు తలదించుకొనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం బాధాకరమని, లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మిణి, చివరకు లోకేశ్ కొడుకు దేవాన్ష్నుకూడా జగన్ అరెస్టు చేసేందుకు వెనుకాడడంటూ మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారని మోత్కుపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధం. ఆయనకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి. ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన సీఎం జగన్ మాత్రమే. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. రాబోయే రోజుల్లో జగన్ కు నాలుగు సీట్లు కూడా రావని మోత్కుపల్లి అన్నారు.
PM Modi Telangana Tour: తెలంగాణలో మోదీ పర్యటన తేదీలు ఖరారు.. బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ..
కరోనా సమయంలో మాస్క్లు లేవని ప్రశ్నించినందుకు సుధాకర్ అనే దళిత వైద్యుడిని కొట్టి ఆటోలో ఈడ్చుకెళ్లారని, ఆయన మరణానికి వైసీపీ ప్రభుత్వం కారణమైందని అన్నారు. అతనిపై దాడిచేసి దళిత జాతిని జగన్ అవమానపర్చాడంటూ మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని వరప్రసాద్ అనే యువకుడు ఇసుక ట్రాక్టర్లు ఊళ్లోనుంచి పోతున్నాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు, వైసీపీ నేతలు ఒక్కటై అతని శిరోమండనం చేయించారని, ఇలాంటి ఘటనలు జగన్ హయాంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయని మోత్కుపల్లి అన్నారు.