అందుకే ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు

వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిందని అచ్చెన్నాయుడు చెప్పారు.

అందుకే ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu

అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు వినతులు సేకరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలోని అక్రమాలు బయట పడుతున్నాయని, అందుకే ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారు.

ఈ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని, రికార్డులను తగులబెట్టిన ఘటనలపై విచారణ జరిపిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. గత ప్రభుత్వం సొంత జాగీరులా రవాణా శాఖలో దోపిడీ కోసం ఐదు జోన్లను ఏర్పాటు చేశారని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిందని అచ్చెన్నాయుడు చెప్పారు. భూ రికార్డులను తారుమారు చేశారని, ఎక్కడ చూసినా భూ సమస్యల మీద ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. త్వరలో గ్రామాలలో రెవెన్యూ అధికారులను పంపి గ్రామ సభలు పెడతామని అన్నారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఆ పార్టీ నేతలు ఒక్కరు కూడా మిగలరని తెలిపారు. ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, అయితే తప్పు చేసినవాడు ఏ పార్టీ వాడైనా వదలొద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

Also Read: అందుకే ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్‌ల‌కు రీ వెరిఫికేషన్ ఆగిపోయింది: వైసీపీ లీగల్ అడ్వైజర్