Pushpa SriVani: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
Pushpa SriVani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా శ్రీవాణి అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. చికిత్స కోసం మంత్రిని మార్గ మధ్యలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో స్కానింగ్, వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోలుకున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పుష్పశ్రీవాణి ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎడ్ చేసిన ఈ మాజీ టీచర్ విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండో సారి గెలిచారు. ఉపాధ్యాయ వృత్తిని వీడి భర్త ప్రోత్సాహంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన పుష్పశ్రీవాణి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందింది. ఎస్టీ మహిళా కోటాలో ఆమె మంత్రి పదవి దక్కించుకున్నారు.
2014 ఎన్నికల్లో 27 ఏళ్ల వయసులో శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ తరుపున బరిలో దిగి 19,083 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేశారు. ఈసారి 26,602 ఓట్ల ఆధిక్యతను సాధించారు. జగన్ ఈమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆమె కుటుంబం ఆ పార్టీలో సాగుతోంది.