AP Cabinet Decisions : కోనసీమ జిల్లా పేరు మార్పు, 27న ఖాతాల్లోకి డబ్బులు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన రెండున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కోనసీమ జిల్లా పేరు మార్పునకు సంబంధించి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అమలాపురం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును ఇకపై అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పరిగణిస్తారు.
Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం
కోనసీమ జిల్లా పేరు మార్పుతో పాటు రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల కూర్పునకు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఇక ఈ నెల 27న అమ్మఒడి(మూడో విడత) పథకానికి నిధుల విడుదలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.(AP Cabinet Decisions)
అలాగే జూలైలో అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.216 కోట్ల మేర పరిహారం ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
* అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం
* దీనికి అవసరమైన చట్టాన్ని సవరించాలని నిర్ణయం
* వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదముద్ర
* జగనన్న విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్నతోడు, వాహనమిత్ర పథకాలకు ఆమోద ముద్ర
* వంశధార నిర్వాసితుల 216 కోట్ల రూపాయల పరిహారం విడుదల చేయాలని క్యాబినెట్ ఆమోదం.
* ఆక్వా రైతులకు సబ్సిడీ మరింత మందికి వర్తింప చేసేలా చర్యలు.
* పదెకరాల వరకు ఆక్వా సాగు చేసుకునే రైతులకు విద్యుత్ సబ్సిడీ.
* ప్రస్తుతమున్న జెడ్పీ ఛైర్మన్లనే వారి కాలపరిమితి ముగిసే దాకా కొనసాగించాలని నిర్ణయం.
* కొత్త జిల్లాలు ఏర్పడినా.. ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ లే కొనసాగుతారు.
* డిసిప్లీనరీ ప్రొసిడీంగ్స్ ట్రిబ్యునల్ ను రద్దు చేశాం.
* రాజ్ భవన్ లో 100 కొత్త పోస్టులు.
* గండికోటలో టూరిజం శాఖకు 1600 ఎకరాల భూమి కేటాయింపు.
ఏపీ మంత్రివర్గ విస్తరణ తర్వాత క్యాబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కొత్త మంత్రివర్గం సమావేశమైంది. 42 అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరం అనుభవిస్తున్నాం అన్నారు. కొందరు బీఆర్ అంబేద్కర్ ను సొంతం చేసుకోకపోవడం బాధాకరం అని హోంమంత్రి వాపోయారు.
మొదట అందరూ.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని ధర్నాలు, ఆందోళనలు చేశారని.. ఆ తరువాత కొందరు ఆయన పేరు పెట్టొద్దని అల్లర్లు సృష్టించారని హోంమంత్రి అన్నారు. అల్లర్లు సృష్టించింది ఎవరో అందరికీ తెలుసు అన్నారామె. అల్లర్లు సృష్టించిన వారికి తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత పేరు కోనసీమ జిల్లాకు పెట్టొద్దని వారు చేసిన విధ్వంసం బాధాకరం అని హోంమంత్రి వాపోయారు.