కరోనా మాస్క్ వేసుకున్న సీఎం జగన్
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కరోనా మాస్క్ ధరించారు. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ఆయన పరిశీలించారు. 2020, ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం సీఎం నివాసంలో సమీక్ష నిర్వహించారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, ప్రతి 2 – 3 రోజులకోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. అంతేగాకుండా..ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా వ్యవస్థను తయారు చేయాలన్నారు.
రెడ్జోన్లకు ముందస్తుగా మాస్క్ లు పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి మనిషికి 3 చొప్పున మాస్కులు ఇస్తున్నామన్నారు. శనివారం ఒక్క రోజే కరోనా 5400 టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన ప్రతి 10 లక్షల మందికి అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో 2వ స్థానానికి ఏపీ చేరుకుందన్నారు. రాజస్థాన్ 685 చేస్తుండగా, 539 పరీక్షలతో రెండో స్థానంలో ఏపీ ఉంది.
ర్యాపిడ్ కిట్స్ వినియోగించకుండానే ఈ స్థాయికి మరో 3–4 రోజుల్లో ఈ టెస్టుల సంఖ్య పెరుగుతుందన్నారు. రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షలు నిర్వహించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, వీరితోపాటు ఫ్రంట్ లైన్లో ఉన్నవారిని కరోనా బీమా కిందకు చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.