గంటాకు షాక్, 4 ఎకరాల భూమి స్వాధీనం
Ganta Srinivasa Rao in trouble : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా అధీనంలో ఉన్న 4ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం భైరవవాక సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో ఈ భూమి ఉంది. ఇక్కడ 124 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా… అందులో 60 ఎకరాలపై కోర్టులో వివాదం నడుస్తోంది.
మిగిలిన 64 ఎకరాలను ఈ రోజు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 4ఎకరాలు గంటా శ్రీనివాసరావు అధీనంలో ఉంది. ఇటీవలే గంటాకు చెందిన ప్రత్యూష రిసోర్స్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పుడు 4ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఇటీవలే…గంటాకు ఇండియన్ బ్యాంకు కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకు నుంచి గతంలో రూ.248కోట్ల మేర రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ బ్యాంకుకు రుణం కట్టకుండా నాలుగేళ్ల నుంచి ఉండడంతో.. చెల్లించకుండా ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చాటేయగా బకాయిలను రాబట్టే క్రమంలో గంటా ఆస్తులను వేలం వెయ్యాలని నిర్ణయం తీసుకుంది బ్యాంకు యాజమాన్యం. తాజాగా 4 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవడం పట్ల గంటా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.