Pawan Kalyan : వైసీపీకి వచ్చేది 45-67 సీట్లే.. ఈ సృష్టిలో ప్రతిదానికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది-జగన్ ప్రభుత్వానికి పవన్ వార్నింగ్

ఒక సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని పవన్ జోస్యం చెప్పారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో కానీ, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan : వైసీపీకి వచ్చేది 45-67 సీట్లే.. ఈ సృష్టిలో ప్రతిదానికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది-జగన్ ప్రభుత్వానికి పవన్ వార్నింగ్

Updated On : September 18, 2022 / 10:38 PM IST

Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు జనసేనాని పవన్ కల్యాణ్. రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని పవన్ ఆరోపించారు. చట్టసభల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని వాళ్లకు చట్టాలు చేసే హక్కు లేదన్నారు పవన్. రాజధాని ఇక్కడే ఉంటుందని ఇల్లు కట్టుకున్న జగన్.. ఇప్పుడు మూడు రాజధానులు అని మాట మార్చడంపై పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలతో ఏపీకి రాజధానే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పర్యావరణం అనుకూలంగా ఉండే రాజధాని పెట్టాలని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. 2014లో టీడీపీకి గుడ్డిగా మద్దతివ్వలేదని, చాలా లోతుగానే ఆలోచించి మద్దతిచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు పవన్. ప్రజలు 151 సీట్లు ఇచ్చినంత మాత్రాన మీరేమీ మహాత్ములు అయిపోరంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా అని ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటారా అని నిలదీశారు. ఈ సృష్టిలో ప్రతిదానికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని, అది అన్నింటికీ వర్తిస్తుందని, ఈ విషయం మర్చిపోవద్దని జగన్ సర్కార్ ను హెచ్చరించారు పవన్ కల్యాణ్.

ఒక్క చాన్స్ ఇద్దాం అని వైసీపీని గెలిపిస్తే అది ఈ రోజు రాష్ట్రానికే ఇబ్బందికరంగా మారిందని, రాష్ట్రం తిరోగమనంలో పయనించే పరిస్థితి తీసుకువచ్చారని పవన్ విమర్శించారు. దొమ్మీలు, దోపిడీలు చేసే వారిని ఎన్నుకుంటే రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ కూర్చుంటారని అన్నారు.

అంతేకాదు.. ఒక సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని పవన్ జోస్యం చెప్పారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో కానీ, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్.

మంగళగిరిలో జనసేన లీగల్ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తాను జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది రాజకీయాల్లోకి రావడమేనని అన్నారు. తాను 2003 నుంచి రాజకీయ అధ్యయనం చేస్తున్నానని, 2009లో ఒక మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా, అనేక కారణాలతో వైఫల్యం చెందామని, మళ్లీ అటువంటి తప్పు నా ఊపిరి ఉన్నంతవరకు జరగకూడదన్న ఉద్దేశంతో 2014లో జనసేన పార్టీ స్థాపించడం జరిగిందని తెలిపారు.

తాను అవమానాలకు భయపడే వ్యక్తిని కాదని, 2019లో ఓటమి పాలవగానే తాను వెనుకంజ వేస్తానని అనుకున్నారని, అలా ఎప్పటికీ జరగదని పవన్ అన్నారు. ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నామని, గెలిచే అభ్యర్థులే బరిలో దిగుతున్నారని పవన్ కల్యాణ్ ఆత్మవిశ్వాసంతో చెప్పారు.