Ola Electric Funding : ఈవీ స్కూటర్ మేకర్ ఫండ్ రైజింగ్ ప్లాన్.. రూ.2,500 కోట్ల నిధులు దక్కించుకున్న ఓలా..!
Ola Electric Funding : దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఫండ్ రైజింగ్ ప్లాన్లో భారీగా నిధులను దక్కించుకుంది. గత డీల్లో ఓలా ఎలక్ట్రిక్ టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎడెల్వీస్ వంటి పెట్టుబడిదారుల నుంచి 200 మిలియన్ డాలర్లను సేకరించింది.
Ola Electric Funding Raising Plan : ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కంపెనీ విస్తరణలో భాగంగా భారీగా నిధులను సేకరించింది. లేటెస్టుగా జరిగిన ఫండ్ రైజింగ్ ప్లాన్లో 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,500 కోట్లు) దక్కించుకుంది. దాంతో కంపెనీ విలువ 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓలా కంపెనీ జనవరి 2022లో 5 బిలియన్ డాలర్ల విలువతో 200 మిలియన్ డాలర్లను సేకరించింది.
ఓలా నిధుల సమీకరణకు ప్రముఖ సావరిన్ (sovereign fund) ఫండ్ కంపెనీ దీనికి నాయకత్వం వహిస్తుంది. ఇతర పెట్టుబడిదారుల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. ఈ డీల్కు సంబంధించిన పేపర్ వర్క్ కొన్ని వారాల్లో ఖరారు కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలో మొదటి ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటైన సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ ఈ రౌండ్లో పాల్గొనడం లేదు. అయితే, నిధుల సమీకరణపై మాట్లాడేందుకు ఓలా ప్రతినిధి నిరాకరించారు.
త్వరలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లపై ఓలా ప్రణాళిక :
గత డీల్లో, ఓలా ఎలక్ట్రిక్ టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎడెల్వీస్ వంటి పెట్టుబడిదారుల నుంచి 200 మిలియన్ డాలర్లను సేకరించింది. ఓలా కంపెనీ ఇప్పటివరకు దాదాపు 900 మిలియన్ డాలర్లను అనేక నిధుల రౌండ్లలో సేకరించింది. ఈ డీల్ నుంచి వచ్చిన డబ్బును కంపెనీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు వినియోగించనుంది. ఏడాదికి 0.5 మిలియన్ల నుంచి 2 మిలియన్లకు పెంచేందుకు ఓలా ఈ నిధులను ఉపయోగించనుంది. ఈ నిధులు సంస్థకు అధునాతన సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ ప్లాంట్ను ఏర్పాటు చేయడంలో సాయపడతాయి. ప్రస్తుతం టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తయారు చేస్తున్న ఓలా కంపెనీ.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను కూడా తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేపడుతోంది.
Read Also : Maruti Suzuki Jimny Bookings : మారుతి సుజుకి జిమ్నీ 30వేల బుకింగ్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
ఏడాదికి 10 మిలియన్ల టూ వీలర్ ప్లాంట్ల నిర్మాణమే లక్ష్యం :
ఓలా కంపెనీ ఏడాదికి 10-మిలియన్ ద్విచక్ర వాహనాల ప్లాంట్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెల్-మేకింగ్ బ్యాటరీ సామర్థ్యాన్ని 20 గిగావాట్-గంటల (GWH) నుంచి 100 GWHకి పెంచేందుకు ప్రణాళికను కూడా రూపొందించింది. ఓలా ప్రస్తుత రాబడి రన్ రేట్ 1.2 బిలియన్ డాలర్లను కలిగి ఉంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వ్యాపారంపై సానుకూలంగా ఉంది. కంపెనీ ప్రారంభమైన 18 నెలల్లోనే ఈ ఘనతను ఓలా సాధించింది. తద్వారా దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లేయర్గా ఓలా అవతరించింది. వాహన్ డేటా ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్లో 21,560 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రారంభించినప్పటి నుంచి అత్యధిక రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. దేశ మార్కెట్లో 34 శాతాన్ని ఆక్రమించింది. మరోవైపు, అదే సమయంలో ఇతర పోటీదారులైన ఏథర్, ఆంపియర్, ఒకినావా, హీరో ఎలక్ట్రిక్, TVS అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి.
భారీగా పెరగనున్న ఈవీ ధరలు :
ఈ క్రమంలోనే ఓలా కంపెనీ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను కలిగి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రస్తుతం 3లక్షల ఇ-స్కూటర్ అమ్మకాలను ఒక మిలియన్ను తాకాలని భావిస్తోంది. ఈ ఏడాదిలో ద్వితీయార్థంలో ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను లాంచ్ చేయనుంది. అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్గా మార్కెట్లోకి రానుంది. జూలై నుంచి రూ. 84,999 ధరకు అందుబాటులోకి రానుంది. ఇదే క్రమంలోనే ఓలా భారీగా అమ్మకాలను పెద్ద ఎత్తున పెంచుతుందని భావిస్తున్నారు. అయితే, ప్రతి స్కూటర్పై (FAME II) సబ్సిడీని దాదాపు మూడింట ఒక వంతు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. సబ్సిడీ లేకుండా, ప్రీమియం ఎండ్లో కంపెనీ ఒక్కో స్కూటర్కు రూ. 40వేల నుంచి 50వేల వరకు అదనంగా భారం పడనుంది. దీంతో వివిధ మోడళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి.