భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీస్ స్టేషన్ ముందు వివాహిత ఆందోళన

  • Published By: murthy ,Published On : July 23, 2020 / 02:00 PM IST
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీస్ స్టేషన్ ముందు వివాహిత ఆందోళన

తాళి కట్టిన భార్యకు తెలియకుండా రెండో వివాహాం చేసుకున్నాడో దుర్మార్గుడు. ఇది తెలిసి భార్య, భర్తను నిలదీస్తే ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆ మహిళ తన కుమార్తెతో కలిసి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. ఈ ఘటన తిరుపతి పెద కాపు వీధిలో జరిగింది.

పెద్దకాపు వీధిలో ఉండే చలపతికి 13 ఏళ్ల క్రితం సరస్వతితో వివాహం జరిగింది. వీరికి 6 ఏళ్ల కుమార్తె ఉంది. వీరి కాపురం చాలా కాలం సజావుగానే సాగింది. ఇటీవల భర్త తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని సరస్వతికి తెలిసింది. అప్పటి నుంచి వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈక్రమంలో చలపతి రెండోభార్య, ఆమె బంధువులు అందరూ కలిసి సరస్వతిని కొట్టి, ఇంట్లోనుంచి గెంటేశారు. దీంతో ఆమె బుధవారం, జులై22 ఈస్ట్ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించగా వారు మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమని సూచించారు.

ఆమె వారి వద్దకు వెళ్లకుండా స్టేషన్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద తన కుమార్తెతో కలిసి కూర్చుని న్యాయం చేయాలని బైఠాయించింది. అదే సమయంలో చలపతి తన రెండో భార్యతో బైక్ పై అటు వచ్చాడు. భర్తను చూసిన సరస్వతి పరుగున వెళ్లి భర్తను అపే ప్రయత్నం చేసింది. బండి తాళం లాక్కునేందుకు ప్రయత్నించగా అతను రెండో భార్యతో ఉడాయించాడు.

స్టేషన్ ఎస్ఐ జయచంద్ర ఆమె వద్దకు వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.  చివరకు మహిళా కానిస్టేబుల్ సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.