Cyber Crimes : దేశంలో మూడేళ్లలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు.. ఎన్నో తెలుసా?
టెక్నాలజీకి తగినట్టుగానే సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరగడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
Cyber Crimes : ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. టెక్నాలజీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే టెక్నాలజీకి తగినట్టుగానే సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరగడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
కరోనా పరిస్థితుల్లో చాలామంది ఆన్ లైన్ విధానానికి అలవాటు పడ్డారు. ఏది కొనాలన్నా.. ప్రతిదీ ఆన్ లైన్లోనే ఎంచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరమైంది. అమాయక వ్యక్తులను లక్ష్యగా చేసుకుని వారినుంచి లక్షల్లో నగదు ఖాళీ చేసేస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన దేశాల్లోనే నేరాల సంఖ్య అధికంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. భారతదేశం వంటి దేశాల్లో సైబర్ నేరాల సంఖ్య అధికంగా పెరిగింది.
గడిచిన మూడేళ్లలో భారత్లో ఏకంగా 36.29 లక్షల సైబర్ సెక్యూరిటీ నేరాలు నమోదయ్యాయి.. మరి ఈ స్థాయిలో సైబర్ నేరాలు పెరగడానికి గల కారణాలపై సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నివేదిక ప్రకారం.. 2019లో 3,94,499 సైబర్ కేసులు నమోదయ్యాయి. అలాగే 2020లో 11,58,208 కేసులు, 2021లో 14,02,809 కేసులు నమోదు కాగా, 2022లో ఇప్పటివరకు 6,74,021 సైబర్ కేసులు నమోదైనట్లు మంత్రి వెల్లడించారు.
Read Also : Google Play Store: యాప్ డెవలపర్లకు గూగుల్ హెచ్చరిక.. ప్లే స్టోర్లో యూజర్ల ప్రైవసీపై నిర్లక్ష్యం వద్దు!