Chennai : వెరైటీ దొంగ-బిర్యానీలో పెట్టుకుని బంగారం తినేశాడు
రంజాన్ వేళ మద్యం తాగటానికి డబ్బులు లేకపోవటంతో అతిధిగా వెళ్లిన ఇంట్లో బిర్యానీతో పాటు బంగారం తినేసిన దొంగను చెన్నై పోలీసులు పట్టుకున్నారు.
Chennai : రంజాన్ వేళ మద్యం తాగటానికి డబ్బులు లేకపోవటంతో అతిధిగా వెళ్లిన ఇంట్లో బిర్యానీతో పాటు బంగారం తినేసిన దొంగను చెన్నై పోలీసులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే….చెన్నైలోని ఒక నగల దుకాణంలో పనిచేసే దాక్షాయణి (34) రంజాన్ పండుగ రోజు అదే షాపులో మేనేజర్ గా పనిచేస్తున్న తార అనే మహిళను విందుకు ఆహ్వానించింది. తార తన బాయ్ ఫ్రెండ్ మహమ్మద్ అబూబకర్(27) తో కలిసిఈ నెల3వ తేదీన సాలిగ్రామంలోని అరుణాచలం రోడ్డులో నివాసం ఉంటున్న దాక్షాయణి అపార్ట్ మెంట్ కు వెళ్ళింది.
ఇద్దరు అతిధులు ఇంటికి వచ్చే సరికి వారికి ప్రత్యేకంగా బిర్యానీ చేసిపెట్టింది దాక్షాయణి. ఇద్దరు వేడి వేడి బిర్యానీ ఆరగించి ఇళ్లకు వెళ్లారు. అతిధులు వెళ్లగానే తను బయటకు వెళ్లేందుకు నగలు వేసుకుందామని దాక్షాయణి బీరువా తెరిచి చూడగా అందులో ఉండాల్సిన రూ. 1.45 లక్షల విలువైన మూడు బంగారు గొలుసులు, వజ్రాల దండ కనిపించలేదు.
షాక్ కుగురైన దాక్షాయణి ఆలోచనలో పడింది. తార, అబూబకర్ మినహా మరెవ్వరూ ఆరోజు తన ఇంటికి రాలేదు. మరి నగలు ఏమయ్యాయనే ఆలోచనలో పడింది. చివరిక తార, అబూబకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణలో అబూబకర్ పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో అతనిపై అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించగా దాక్షాయణి ఇంట్లో కనిపించకుండా పోయిన బంగారు ఆభరణాలు అతని పొట్టలో కనపడ్డాయి.
Also Read : Tiger attack: పులిని ఫోటో తీద్దామని వెళ్లాడు.. పంజాతో కొడితే..
రంజాన్ వేళ మద్యం తాగటానికి డబ్బులులేకపోవటంతో నగలు దొంగతనం చేశానని… బిర్యానీ తయారీలో దాక్షాయణి బిజీగా ఉన్నటైంలో దొంగతనం చేశానని చెప్పాడు. బిర్యానీ మధ్యలో పెట్టి నగలు మింగేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. నిందితుడికి పోలీసులు వెంటనే ఎనిమా ఇచ్చి నగలను బయటకు రప్పించి దాక్షాయణికి ఇచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేయగా దాక్షాయణి విజ్ఞప్తి మేరకు నిందితుడిని హెచ్చరించి వదిలి పెట్టారు.