Mumbai: బాత్రూమ్లో దంపతుల అనుమానాస్పద మృతి.. గీజరే కారణమా?
బుధవారం ఉదయం వాళ్ల ఫ్లాట్లో పని చేసేందుకు పని మనిషి వెళ్లింది. ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ, లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చాలా సేపు ప్రయత్నించిన పనిమనిషి చివరకు దగ్గర్లోనే ఉంటున్న దీపక్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసింది. ఆమె, మరికొందరితో కలిసొచ్చి తన దగ్గరున్న మరో కీతో ఇంటి తలుపులు తెరిచింది.
Mumbai: ముంబైలో ఒక జంట అనుమానాస్పదంగా మృతి చెందింది. ఘట్కోపర్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లోని బాత్రూమ్లో దంపతుల మృతదేహాలు లభించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కోపర్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో దీపక్ షా (42), రినా షా (39) అనే దంపతులు ఉంటున్నారు.
బుధవారం ఉదయం వాళ్ల ఫ్లాట్లో పని చేసేందుకు పని మనిషి వెళ్లింది. ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ, లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చాలా సేపు ప్రయత్నించిన పనిమనిషి చివరకు దగ్గర్లోనే ఉంటున్న దీపక్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసింది. ఆమె, మరికొందరితో కలిసొచ్చి తన దగ్గరున్న మరో కీతో ఇంటి తలుపులు తెరిచింది. ఆ సమయంలో బాత్రూమ్ నుంచి షవర్ శబ్దం వినిపించింది. దీంతో బాత్రూమ్ తలుపు తెరిచి చూడగా ఇద్దరూ దుస్తులు లేకుండా కింద పడిపోయి ఉన్నారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి చేర్చారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మరణించారని తెలిపారు. ఈ దంపతుల మృతి అనుమానాస్పదంగా ఉంది.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని, ఇద్దరి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టమ్ కోసం తరలించారు. అయితే, బాత్రూమ్లోని గీజర్ షాక్ కొట్టడం వల్లే ఆ దంపతులు మరణించి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంటి దగ్గర పోలీసులు తనిఖీ చేసినప్పటికీ, ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించలేదని పోలీసులు తెలిపారు. కాగా, పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వారి మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.