Ruby Hotel Fire Accident : సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదం కేసు.. రంజిత్ సింగ్ బగ్గా సహా నలుగురు అరెస్ట్
సికింద్రాబాద్ రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ruby Hotel Fire Accident : సికింద్రాబాద్ రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హోటల్ ఓనర్, మేనేజర్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మార్కెట్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నలుగురు నిందితులను పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రమాదం తర్వాత నలుగురు నిందితులు మేడ్చల్ లోని ఫార్మ్ హౌస్ లో దాక్కున్నారు.
యజమానుల నిర్లక్ష్యంగా కారణంగా హోటల్ లో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. హోటల్ యజమానుల నిర్లక్ష్యం 8మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంది.
మేడ్చల్ లోని ఫామ్ హౌస్ లో దాక్కున్న ఓనర్ రంజిత్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గా, హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, హోటల్ సూపర్ వైజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ పరిధిలోని రూబీ లాడ్జి సెల్లార్ లో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8మంది చనిపోయారు. రూబీ లాడ్జి భవనం సెల్లార్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈ-బైక్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్ నుండి వచ్చిన పొగ.. లాడ్జిలోని మొదటి, రెండో ఫ్లోర్లకు వ్యాపించింది. దీంతో అందులో ఉన్న వారు ఊపిరాడక చనిపోయారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పైనుంచి కిందకు దూకిన కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రూబీ లాడ్జి సెల్లార్లో ఉన్న ఎలక్ట్రిక్ బైకుల వద్ద తొలుత పేలుడు సంభవించింది. ఆ తర్వాత బైకులు వరుసగా పేలినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అక్కడ జరిగిన పేలుడుతోనే దట్టమైన పొగ లాడ్జిని చుట్టుముట్టినట్లు ఫుటేజీలో ఉంది. తొలుత పొగలు వచ్చాయి. ఆ తర్వాత పేలుళ్లు ప్రారంభం అయ్యాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే అంతా భస్మమైంది. ఈ బైక్ లు మంటల్లో కాలిబూడదయ్యాయి.
నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ లో ఈ బైక్స్ షోరూమ్ నిర్వహిస్తున్నారని అగ్నిమాపక అధికారులు గుర్తించారు. ఈ భవనం ఉన్న ఎత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం రెండు వైపులా మెట్లు ఏర్పాటు చేయాలి. కానీ నిబంధనలకు విరుద్దంగా ఒకే వైపున మెట్లు ఏర్పాటు చేశారని అగ్నిమాపక అధికారులు చెప్పారు. కేవలం 11 సెకన్ల వ్యవధిలోనే మంటలు వ్యాపించినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ బైక్స్ షోరూమ్ యజమాని రంజిత్ సింగ్ బగ్గ, భవన యజమాని సుమిత్ సింగ్ బగ్గ, హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్లు పరార్ అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందు ఈ బైక్స్ షోరూమ్ నిర్వహిస్తున్న రంజిత్ సింగ్ బగ్గ, సుమిత్ సింగ్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.