Gurukula jobs : తెలంగాణాలో గురుకుల ఉద్యోగాల భర్తీకి ఈనెల 12 నుండి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
తొలుత ఓటీఆర్ నమోదు చేసుకుంటేనే అభ్యర్ధులకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హత లభిస్తుంది. ఓటీఆర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత వచ్చే నంబరుతో అభ్యర్ధులు వారి వారి విద్యార్హతల మేరకు ఆయా సబ్జెక్టుల వారిగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
Gurukula jobs : తెలంగాణా రాష్ట్ర పరిధిలోని గురుకులాల్లో 9,231 పోస్టులను భర్తీ చేసేందుకు గురుకుల నియామక బోర్డు ఇప్పటికే తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 17 నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో ముందుగా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 12 నుండి ప్రారంభం కానుంది.
READ ALSO : Vegetarian Protein : కండరాల నిర్మాణానికి దోహదపడే శాఖాహార ప్రొటీన్ !
ప్రతి పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి రావటం, తప్పుల వల్ల తిరిగి సవరణల కోసం బోర్డు చుట్టూ తిరగటం వంటి సమస్యలు లేకుండా గురుకుల బోర్డు దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేస్తూ ఓటీఆర్ విధానాన్ని తీసుకువచ్చింది.
తొలుత ఓటీఆర్ నమోదు చేసుకుంటేనే అభ్యర్ధులకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హత లభిస్తుంది. ఓటీఆర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత వచ్చే నంబరుతో అభ్యర్ధులు వారి వారి విద్యార్హతల మేరకు ఆయా సబ్జెక్టుల వారిగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అదే క్రమంలో గురుకుల నియామకాలకు సంబంధించి పరీక్ష ఫీజులు పెంచటంలేదని గతంలో ఉన్న ఫీజులే కొనసాగుతాయని బోర్డు వెల్లడించింది. అయితే ఒక్కో అభ్యర్ధి రెండు అంతకన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉండటంతో పరీక్ష ఫీజు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. ఇది తమకు భారంగా మారుతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.