రాష్ట్రంలో బయటకొస్తే మాస్కులు తప్పనిసరి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్లు ధరించాలంటూ స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్క్లు పెట్టుకోవాలంటూ ఆదేశాలు విడుదల చేసింది.(తప్పు ఒప్పుకున్న WHO: భారత్లో కరోనావైరస్ సామాజిక వ్యాప్తిలేదు)
బయట దొరికే మాస్కులతో పాటు ఇళ్లలో తయారు చేసిన మాస్క్లను కూడా ధరించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్లు పెట్టుకోకుంటే అరెస్టుతో పాటు జరిమానాలు విధిస్తున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో తెలంగాణ చేరింది.
ఓ అధ్యయనం ప్రకారం మాస్కుల వినియోగంతో జపాన్లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గినట్లు తేలడంతో దేశంలో ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. దగ్గడం, తుమ్మడం, మాట్లాడే సమయాల్లో వెలువడే తుంపర్లు అవతలి వ్యక్తిపై పడటంతో కోవిడ్-19 వ్యాపిస్తుంది. దానిని అరికట్టాలంటే ఈ మేరకు నిర్ణయం తప్పదని ప్రభుత్వం అభిప్రాయం.