జీతాలు ఇవ్వము, విధుల్లో చేరాలంటే నిబంధనలు పాటించాల్సిందే : ఆర్టీసీ కార్మికులకు తేల్చి చెప్పిన ప్రభుత్వం

సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 12:06 PM IST
జీతాలు ఇవ్వము, విధుల్లో చేరాలంటే నిబంధనలు పాటించాల్సిందే : ఆర్టీసీ కార్మికులకు తేల్చి చెప్పిన ప్రభుత్వం

సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన

సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన తెలిపింది. కార్మికులు విధుల్లో చేరాలంటే నిబంధనలు పాటించాల్సిందే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడే డ్యూటీలో చేరాలని స్పష్టం చేసింది. షరతులు లేకుండా కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశమే లేదని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ బేషరతు డిమాండ్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని వెల్లడించింది. అలాగే సమ్మె కాలానికి జీతాలు చెల్లించేది లేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. వీటన్నింటికి ఆర్టీసీ జేఏసీ ఓకే అంటేనే.. తిరిగి కార్మికులను డ్యూటీలో చేర్చుకోవాలన్నది ప్రభుత్వం భావనగా తెలుస్తోంది.

కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని ఇప్పటికే పిలుపునిచ్చామని ప్రభుత్వం గుర్తు చేసింది. కాగా, ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం గురువారం(నవంబర్ 21,2019) ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

50 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. బుధవారం(నవంబర్ 20,2019) అత్యవసరంగా భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ.. సమ్మెపై సంచలన ప్రకటన చేసింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ ఓ కండీషన్ పెట్టింది. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటేనే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు. సమ్మెకు ముందున్న పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను లేబర్ కోర్టుకు ప్రభుత్వం సత్వరమే నివేదించాలన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఓ ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. 

హైకోర్టు తుది తీర్పుపై సమీక్షించుకున్నామని, సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులు ఎలాంటి పేపర్లు, షరతులపై సంతకాలు పెట్టరని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కేవలం డ్యూటీ చార్టుల మీదే కార్మికులు సంతకాలు పెడతారని చెప్పారు. హైకోర్టు తీర్పును గౌరవించే బాధ్యత ఇరుపక్షాలకు ఉందన్నారు. కోర్టు తీర్పు తర్వాత తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి అన్నారు.

బుధవారం హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. సమ్మెపై కీలక ప్రకటన చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం(నవంబర్ 19,2019) ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. కోర్టు తీర్పును పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన జేఏసీ.. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామంది.