నాగార్జున సాగర్ లో బౌద్ధ విశ్వవిద్యాలయం

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 03:45 AM IST
నాగార్జున సాగర్ లో బౌద్ధ విశ్వవిద్యాలయం

బౌద్ధంలో మహాయాన పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చైనా, సింగపూర్, కంబోడియా, మలేసియా, జపాన్‌.. తదితర దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మహాయాన పద్ధతిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య నాగార్జునుడంటే.. ఆ దేశాల్లో బౌద్ధులకు ప్రత్యేక ఆరాధన భావముంది. నాగార్జునుడు నివసించిన ప్రాంతం నాగార్జునసాగర్‌ పరిసరాలే కావటంతో ఇక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. 

నాగార్జునుడి కాలంలో ఈ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించిన విశ్వవిద్యాలయం విలసిల్లింది. అప్పట్లోనే ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. అందుకే చరిత్రకు సరైన గౌరవం ఇవ్వడంతోపాటు నాటి యూనివర్సిటీని పునరుద్ధరించినట్లవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

నాగార్జునసాగర్‌లో ప్రపంచ స్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనం పేరుతో బౌద్ధ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీని పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ బుద్ధవనంలోనే ఇప్పుడు మలేషియా ఆర్థికసాయంతో అంతర్జాతీయస్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. 

మలేషియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ గ్రూపు ఇందుకోసం రూ.200 కోట్లను వెచ్చించేందుకు సంసిద్ధత తెలిపింది. డీఎక్స్‌ఎన్‌ గ్రూపు అధినేత, చైనా మూలాలున్న పారిశ్రామిక వేత్త లిమ్‌ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మలేసియా సంస్థ పనులు ప్రారంభించనుంది.   

* అత్యాధునిక హంగులతో:
బుద్ధగయలోని ప్రధాన మందిరం నమూనాలోనే ఇక్కడ యూనివర్సిటీ ప్రధాన భవనం రూపుదిద్దుకోనుంది. ఇది 21 అంతస్తుల్లో 6.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 15 ఎకరాల్లో రూ.147 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. దీనికి నలుదిక్కులా ఒక్కోటి 7 అంతస్తుల్లో నాలుగు భవనాలుంటాయి.
– ఔషధ మొక్కలు, మామిడి మొక్కలతో 8 ఎకరాల్లో పెద్ద తోట పెంచుతారు. 

* 70 అడుగుల నాగార్జునుడి విగ్రహ నిర్మాణానికి తైవాన్‌ చేయూత:
– బౌద్ధాన్ని అనుసరించే మరోదేశం తైవాన్‌ కూడా నాగార్జునసాగర్‌లో నిర్మాణాలకు ముందుకొచ్చింది.
– దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో ఓ భారీ బౌద్ధ మందిరాన్ని నిర్మిస్తారు. ఇక్కడ 70 అడుగుల ఎత్తుతో ఆచార్య నాగార్జునుడి భారీ విగ్రహం ఏర్పాటు చేస్తారు. 
– సైన్స్, మెకానికల్, కార్పెంటరీ శిక్షణతో కూడిన వృత్తి విద్యా కేంద్రం ఉంటుంది. 60 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.18 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తారు. 
– బెంగళూరుకు చెందిన లోటస్‌ నిక్కో గ్రూపు 5–స్టార్‌ హోటల్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇందుకు రూ.42 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.