ప్రాణాలు తీస్తున్న విషపు గాలి.. లక్షలాదిమంది మృతి

ప్రాణాలు తీస్తున్న విషపు గాలి.. లక్షలాదిమంది మృతి

27 lakh people die every year due to air pollution : భారతదేశంలో ఏటా 27 లక్షల మంది వాయు కాలుష్యానికి బలి అయిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 27లక్షలమంది వాయు కాలుష్యానికి ప్రాణాలు కోల్పోతుంటే..అదే ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారని వెల్లడైంది. వాయుకాలుష్యంతో జరిగే మరణాలు ఎక్కువగా చైనా, భారత్‌లోనే జరుగుతున్నాయని తేలింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అని చెప్పక తప్పదు.

భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ లండన్ యూనివర్సిటీ సహా మరికొన్ని సంస్థలు నిర్వహించిన అధ్యయంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. భారతదేశంలో ప్రతి ఏటా సంభవిస్తున్న మరణాల్లో 30.7 శాతం అంటే దాదాపు 27 లక్షల మంది శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న విషతుల్యమైన గాలిని పీల్చడం ద్వారా చనిపోతున్నట్టు తేలింది. బొగ్గు, పెట్రోలు, డీజిల్ వంటి శిలా ఇంధనాల వినియోగం వల్ల వెలువడుతున్న కాలుష్యం కారణంగా 2018లో ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది చనిపోయినట్టు అధ్యయన నివేదిక వెల్లడించింది.

ప్రజల ప్రాణాల్ని నిలువునా తీసేస్తున్న ఈ వాయుకాలుష్యం పలు వ్యాధులకు కారణమవుతోంది. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధులకు కారణమవుతోంది. ఈ కాలుష్య కాటుకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవట్లేదు.

ప్రతీ ఐదు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగా సంభవిస్తున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. నిజానికి ఊహించిన దానికంటే కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. పంట వ్యర్థాల దగ్థం, దుమ్ము, పొగ, కార్చిచ్చులతో గాల్లో కలిసిపోయే సూక్ష్మరేణువుల వల్ల 42 లక్షల మంది చనిపోతున్నారని అధ్యయనం చేసినవారు వెల్లడించారు.

అదే ప్రపంచవ్యాప్తంగా చూడగా..శిలాజ ఇంధనాల కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల లిస్టులో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో ఏటా 39.1 లక్షల మంది మరణిస్తుండగా, మన దేశంలో 24.6 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు.

ఇది రాష్ట్రాల వారీగా చూసుకుంటూ..ఉత్తరప్రదేశ్‌లో 2018లో అత్యధికంగా 4,71,546 మంది వాయుకాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాతి స్థానంలో బీహార్ ఉంది. అక్కడ 2,88,821 మంది మరణించారని తేల్చింది అధ్యయనం.

కాగా వాయుకాలుష్య కాటుకు అమ్మ కడుపుల్లోని శిశువులు కూడా ప్రాణాపాయం సంభవిస్తోంది. అమ్మకడుపులో ఉండే పసిగుడ్డులు ఈ వాయు కాలుష్యానికి ప్రతీ ఏటా దక్షిణ ఆసియాలో 3,49,681 గర్భ విచ్ఛిత్తి కేసులు నమోదవుతున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రతీ ఏటా 7 శాతం చొప్పున పెరుగుతున్నాయని వెల్లడైంది. ఇది భారత్ లోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో 29శాతం అబార్షన్లకు కారణం వాయు కాలుష్యమేనని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.