Taliban : అప్ఘాన్లో తిరుగుబాటు, ఆ జిల్లాల్లో తాలిబన్లను తరిమికొట్టారు
తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
Afghanistan : అఫ్ఘానిస్తాన్లో ప్రజా తిరుగుబాటు మొదలైంది. తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాలిబన్లకు మెడలు వంచేది లేదని… సాయుధ పంథాలోనే వారికి బుద్ది చెబుతామని కదులుతున్నారు. యాంటీ తాలిబన్ కమాండర్ ఖైర్ మహమ్మద్ నేతృత్వంలో స్థానిక ప్రజలు జరిపిన తిరుగుబాటులో బాగ్లన్ ప్రావిన్స్లోని మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి విముక్తి చేయగలిగారు. ఇందులో పొల్-ఈ-హెసర్, దెహ్ సలహ్, బను జిల్లాలున్నాయి.
Read More : Yadadri Temple : యాదాద్రి ఆలయ ప్రారంభం, ముహూర్తం ఫిక్స్!
ఆ మూడు జిల్లాల నుంచి తాలిబన్లను తరిమికొట్టి తాలిబన్ జెండా స్థానంలో అఫ్ఘానిస్తాన్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ తిరుగుబాటులో ముగ్గురు తాలిబన్ ఫైటర్లు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఇతర జిల్లాలను కూడా తాలిబన్ల చెర నుంచి విముక్తి చేయనున్నట్లు ఖైర్ మహమ్మద్ సారధ్యంలోని తిరుగుబాటు బృందం ప్రకటించింది.
Read More : Gold Rate Today : గడిచిన 10 రోజుల్లో రూ.900 పెరిగిన బంగారం ధర
మరోవైపు పంజ్షేర్ కేంద్రంగా తాలిబన్లను అణచివేసే ప్లాన్పై అఫ్ఘాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటివరకు అఫ్ఘానిస్తాన్లో తాలిబన్ల వశం కాని ప్రావిన్స్ ఇదొక్కటే. ఇక్కడ అడుగుపెట్టాలంటే తాలిబన్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడే కాదు, గతంలోనూ తాలిబన్లు ఇక్కడ అడుగుపెట్టలేకపోయారు. ఇందుకు కారణం ఇక్కడి ప్రజల తెగింపేనని తెలుస్తోంది. ఉగ్రవాదులను అంతం చేయడమే తప్ప… వారికి తలవంచడం పంజ్షేర్ వాసుల చరిత్రలోనే లేదు. అందుకే ఈ ప్రాంతం అడ్డాగా తాలిబన్లపై తిరుగుబాటుకు సలేహ్ పోరాట వ్యూహాలు రచిస్తున్నారు.