temple in space : అంతరిక్షంలో బుద్ధుడి టెంపుల్, ఆన్ లైన్ లో ప్రార్థనలు
outer space : ఇప్పటి వరకు భూమిపై ఉన్న బౌద్ధాలయాల్లో కనిపించే బుద్ధుడు మరో రెండేళ్లలో అంతరిక్షంలోనూ దర్శనం ఇవ్వనున్నాడు. జపాన్లోని క్యోటోలో ఉన్న డయ్గోజి దేవాలయంలోని సన్యాసులు అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఓ శాటిలైట్ డెవలప్మెంట్ కంపెనీతో కలిసి చేతులు కలిపారు. 2023లో ఈ దేవాలయం అందుబాటులోకి రానుందని డయ్గోజీ దేవాలయానికి చెందిన సన్యాసులు, టెర్రా స్పేస్ సంస్థ సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈ ఆలయం నిర్వహణను డయ్గోజీ ఆలయ పూజారులు చూసుకుంటారు.
టెర్రా స్పేస్ అనే కంపెనీ శాటిలైట్లను తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీ ఓ శాటిలైట్లో జొటెనిన్ గౌంజీ పేరుతో ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఒక చిన్నపాటి డబ్బా రూపంలో ఉండే దేవాలయంలో మండల పెయింటింగ్స్ వేసి అందులో చిన్న బుద్ధుడి విగ్రహం పెట్టనున్నారు. దీన్ని శాటిలైట్లో పెట్టి అంతరిక్షంలోకి పంపుతామన్నారు. భూమిపైనే భక్తులు ఆన్లైన్ ద్వారా తమ ప్రార్థనలను నిర్వాహకులకు పంపిస్తే.. ఆ ప్రార్థనలు అంతరిక్షంలోని శాటిలైట్లో ఉన్న దేవాలయానికి పంపిస్తారన్నారు. అవి అక్కడ అమర్చిన మెమొరీ డివైజ్లో నిక్షిప్తవుతాయని తెలిపారు. సాధారణంగా ఒక్క శాటిలైట్ తయారు చేసి అంతరిక్షంలోకి పంపడానికి 200 మిలియన్ యెన్లు అవసరమవుతాయన్నారు. దీంతో ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేవారి కోసం బౌద్ధ సన్యాసులు, టెర్రా స్పేస్ ప్రతినిధులు అన్వేషిస్తున్నారు.