India Poverty : భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. 10శాతం పెరిగిన రైతుల ఆదాయం-వరల్డ్ బ్యాంక్

భారత్ లో పేదరికం తగ్గిందా? అంటే, అవుననే అంటోంది వరల్డ్ బ్యాంక్. భారత్ లో పేదరికం భారీగా తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.

India Poverty : భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. 10శాతం పెరిగిన రైతుల ఆదాయం-వరల్డ్ బ్యాంక్

India Poverty

India Poverty : భారత్ లో పేదరికం తగ్గిందా? అంటే, అవుననే అంటోంది వరల్డ్ బ్యాంక్. 2011తో పోలిస్తే 2019లో భారత్ లో పేదరికం భారీగా తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. తొమ్మిదేళ్లలో ఏకంగా 12.3శాతం మేర పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 2011తో పోల్చితే 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం.. 2019లో 10.2 శాతానికి పడిపోయిందని వివరించింది.

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అర్బన్ ప్రాంతాల్లో పేదరికం 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిందని పరిశోధన నివేదికలో ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. చిన్న కమతాలున్న రైతులు అధిక లాభాలు పొందుతున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. పెద్ద కమతాలున్న రైతుల వార్షిక ఆదాయం 2శాతం మేర పెరిగితే, చిన్న రైతుల ఆదాయం 10శాతం పెరిగినట్లు వివరించింది. మొత్తంగా భారత్ లో దశాబ్ద కాలంలో పేదరికం తగ్గిందన్న వరల్డ్ బ్యాంక్.. కానీ, అనుకున్నంతగా తగ్గలేదని పేర్కొంది.

ప్రపంచ బ్యాంకు వర్కింగ్ పేపర్‌ లో తెలిపిన వివరాల ప్రకారం.. మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉంది. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 26.3 శాతం ఉండేది. ఇది 2019లో 11.6 శాతానికి తగ్గిందని తెలిపింది. అదే సమయంలో అర్బన్‌ ప్రాంతాల్లో పేదరికం 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిందని వివరించింది. 2011-2019లో గ్రామీణ, పట్టణ పేదరికం 14.7, 7.9 శాతం పాయింట్లు తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది.

భారత్ లో పేదరికం తగ్గిందని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఇదే విధంగా చెప్పిన సంగతి తెలిసిందే. భారత దేశం తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని ఐఎంఎఫ్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది. ప్రభుత్వం ఉచితంగా ఆహార సరుకులను అందజేస్తుండటంతో వినియోగంలో అసమానతలు 40 ఏళ్లలో కనిష్ట స్థాయికి తగ్గిపోయినట్లు తెలిపింది.