ఐస్ క్రీమ్ లో కరోనా వైరస్ క్రిములు!
Ice Cream Samples : చైనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలో కరోనా వైరస్ను గుర్తించారు చైనా వైద్యాధికారులు. అది ఎక్కడెక్కడికి వ్యాప్తి చెందిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ కంపెనీలో తయారు చేసిన.. దాదాపు 4 వేల 8 వందల ఐస్ క్రీమ్ బాక్సుల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. టియాంజిన్ ఫుడ్ కంపెనీలో ఇప్పటికే స్టోరేజ్లో ఉంచిన 2 వేల ఐస్ క్రీం బాక్సులను సీజ్ చేశారు. 18 వందల 12 బాక్సులను ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయగా.. మరో 935 బాక్సులు మార్కెట్లోకి వెళ్లిపోయాయి. కానీ ఇప్పటి వరకు 65 బాక్సులు మాత్రమే విక్రయించినట్లు గుర్తించారు.
ఈ ఐస్ క్రీంలు ఎవరెవరు కొనుగోలు చేశారో తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. ఫుడ్ కంపెనీలో పని చేసే 16 వందల 62 మంది ఉద్యోగులను సెల్ఫ్ ఐసోలేషన్కు పంపించింది కంపెనీ యాజమాన్యం. వీరందిరికీ కరోనా పరీక్షలు నిర్వహించింది. ఐస్ క్రీం ఫ్యాక్టరీలో శానిటైజేషన్, సరైన పారిశుధ్యం లేకపోవడం కారణంగానే వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు అధికారులు. కోల్డ్ స్టోరేజ్లో ఉండటం కారణంగా వైరస్ సులభంగా వ్యాపించిందని తెలిపారు. వైరస్ ఫుడ్ బాక్సులను వేరు చేశామని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.
చైనాలో శుక్రవారం ఒక్కరోజే కోటి మందికి కరోనా పరీక్షలు నిర్వహించారంటేనే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతవారం రోజులుగా చైనాలో గణనీయంగా కరోనా కేసులు పెరుగుతన్నాయని కథనాలు వస్తున్నాయి.. దీంతో షిజియాజువాంగ్లో కఠిన ఆంక్షలు విధించారు. జనవరి 19 వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేశారు.