Pakistan Army: పాక్ ఆర్మీపై ఐఈడీ దాడి.. వరుస పేలుళ్లలో ఆరుగురు సైనికులు మృతి.. 15మందికి గాయాలు
పాకిస్థాన్ ఆర్మీపై దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు పాక్ ఆర్మీ సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Pakistan Army: పాకిస్థాన్ ఆర్మీపై దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు పాక్ ఆర్మీ సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్ సైన్యంపై కహాన్ క్లియరెన్స్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన దాడిలో ఐదుగురు పాక్ సైనికులు మరణించగా, బలూచిస్థాన్ లోని మరో ప్రాంతంలో గ్రెనేడ్లతో జరిగిన దాడిలో ఓ సైనికుడు మరణించారు.
పాక్ ఆర్మీ మీడియా విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. కహాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నారని ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. పాకిస్థాన్ – ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు మీదుగా కేపీ( ఖైబర్ పఖ్తుంఖ్వా)లోకి చొరబడేందుకు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. వీరికి ఆఫ్ఘానిస్థాన్ నుంచి సాయం అందుతున్నట్లు సమాచారంతో పాక్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. బలూచిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సైన్యం సోదాలు నిర్వహిస్తుంది. ఆదివారం ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో ఓ ఉగ్రవాది మరణించారు. అయితే ఐఈడీ దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ నిషేధిత మిలిటెంట్ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ( బీఎల్ఏ) గ్రూప్ ప్రకటించింది.
మరోవైపు ఆప్ఘానిస్థాన్ సరిహద్దు బలూచిస్థాన్లోని క్వెట్టా, లాస్బెలా, ఖజ్దార్లలో వరుస గ్రెనేడ్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులో ఒక పాక్ ఆర్మీ జవాన్ మరణించగా, 15 మందికి గాయాలయ్యాయి. క్వెట్టాలోని శాటిలైట్ టౌన్ లో చలో బావ్రీ ప్రాంతంలో పోలీసు పోస్ట్ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.