Tokyo Olympics Over : ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు…ఏఏ దేశాలు ఎన్ని పతకాలు సాధించాయంటే

టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. జులై 23న ప్రారంభమైన ఒలింపిక్స్..ఈరోజుతో అంటే ఆగస్టు 8తో ముగిసాయి. ఈ ఒలింపిక్స్ లో ఎంతోమంది క్రీడాకారులు కల నెర్చుకున్నారు. ఇంకెంతోమంది కొత్త చరిత్రలు లిఖించారు. ఈ క్రీడల్లో ఏఏ దేశాలకు ఎన్ని పతకాలు వచ్చాయంటే...

Tokyo Olympics Over : ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు…ఏఏ దేశాలు ఎన్ని పతకాలు సాధించాయంటే

Tokyo Olympics Concludes With A Grand Note

Tokyo Olympics over : టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. జులై 23న ప్రారంభమైన ఒలింపిక్స్..ఈరోజుతో అంటే ఆగస్టు 8తో ముగిసాయి. అందరినీ అలరించిన క్రీడోత్సవం ముగిసింది. ఈ క్రీడల్లో ఐదు ఖండాలకు చెందిన క్రీడాకారులు తమ తమ దేశాలకు పతకాల పంట పండించాలని ఉవ్విళ్లూరారు. ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించాలనే ఎంతోమంది క్రీడాకారులు కల నెరవేరింది. ఈ క్రీడల్లో అమెరికా పతకాల పంట పండించుకుంది. అమెరికా క్రీడాకారులు పతకాలను ఎగరేసుకుపోయారు. అమెరికా తరువాత చైనా పతకాలు సాధించటంలో రెండో స్థానంలో ఉండగా..భారత్ కు 48వ స్థానానికి పరిమితమైంది. మరి ఏదేశానికి ఎన్ని పతకాలు వచ్చాయో తెలుసుకుందాం..

ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. జులై 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా, కరోనా సంక్షోభ సమయంలోనూ జపాన్ ప్రభుత్వం ఎంతో దృఢ సంకల్పంతో క్రీడలు నిర్వహించింది. కరోనా నిబంధనలు పాటించటంలో ఏమాత్రం రాజీ పడకుండా..కట్టుదిట్టమైన బయో బబుల్ నిబంధనలు అమలు చేసి సజావుగా ఒలింపిక్స్ నిర్వహించి అందరి ప్రశసంలు అందుకుంది. ఈక్రీడల్లో ఎంతోమంది క్రీడాకారులు సరికొత్త చరిత్రలు సృష్టించారు.

టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా నెంబర్ వన్ గా నిలిచింది. ఆఖరి వరకు అమెరికా, చైనా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే చివర్లో అనేక క్రీడాంశాల్లో అమెరికా పసిడి పతకాలు సాధించి చైనాను వెనక్కి నెట్టింది.అలా అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు సహా మొత్తం 113 పతకాలు సాధించింది. చైనా 38 పసిడి పతకాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలు చేజిక్కించుకుని రెండోస్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన జపాన్ 27 స్వర్ణాలతో మూడో స్థానంలో నిలిచింది. జపాన్ మొత్తం పతకాలు 58 సాధించింది. ఆ తర్వాత వరుసగా బ్రిటన్ (22 స్వర్ణాలు), రష్యా ఒలింపిక్ కమిటీ జట్టు (20 స్వర్ణాలు) టాప్-5లో నిలిచాయి.

భారత్ కు పతకాల పట్టికలో 48వ స్థానం దక్కింది. భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో సహా మొత్తం 7 మెడ‌ల్స్ ఉన్నాయి. ఒలింపిక్స్‌లో ఇండియా సాధించిన అత్య‌ధిక మెడ‌ల్స్ ఇవే కావ‌డం విశేషం.

టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో మీరాభాయి చాను భారత్ పతకాల ఖాతాను తెరవగా ఆఖరిలో నీరజ్ చోప్రా జువెలిన్ త్రోలో స్వర్ణ పతకం అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత దేశం తరఫున స్వర్ణపతకం అందుకున్న రెండో వ్యక్తిగత ఆటగాడు నీరజ్ కొత్త చరిత్రను లిఖించాడు.

ఒలింపిక్స్ క్రీడలు ముగింపులో జపాన్ జాతీయ ప్రతినిధి జనరల్ మేనేజర్ మిత్సుగి ఒగాటా మాట్లాడుతూ..అథ్లెట్లను ప్రశంసించారు. ఈకరోనా కాలంలో క్రీడల్ని సమర్థవంతంగా నిర్వహించగలిగామని దానికి సహకరించినవారికి ధన్యవాదాలు తెలిపారు. పతకాలు సాధించినవారికి అభినందనలు తెలిపారు.

ఘనంగా ముగింపు కార్యక్రమం..
ఆదివారం క్రీడల క్లోజింగ్ సెర్మ‌నీతో సాయొనారా (గుడ్‌బై) చెప్పింది. ముగింపు సంద‌ర్భంగా మ‌రోసారి అన్ని దేశాల‌కు చెందిన అథ్లెట్లు త‌మ జాతీయ ప‌తాకాల‌తో స్టేడియంలోకి వ‌చ్చారు. ఇండియా త‌ర‌ఫున బ్రాంజ్ మెడ‌ల్ విన్న‌ర్, రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియా త్రివ‌ర్ణ ప‌తాకంతో సంద‌డి చేశాడు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణిక‌స్తున్న స‌మ‌యంలో విజ‌యవంతంగా ఈ విశ్వ‌క్రీడా సంబ‌రాన్ని నిర్వ‌హించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. క్లోజింగ్ సెర్మనీ ప్రారంభంలో జ‌పాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఐఓసీ అధ్యక్షుడు థామ‌స్ బాక్‌తో క‌లిసి స్టేడియంలోకి వ‌చ్చారు.

మూడేళ్ల త‌ర్వాత 2024లో ఈ గేమ్స్‌ను నిర్వ‌హించ‌డానికి ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ సిద్ధ‌మ‌వుతోంది. క్లోజింగ్ సెర్మ‌నీ సంద‌ర్భంగానే మెన్స్‌, వుమెన్స్ మార‌థాన్ విజేత‌ల‌కు మెడ‌ల్స్ అంద‌జేశారు. కెన్యాకు చెందిన పెరెస్ జెప్‌చిర్‌చిర్ మహిళ‌ల మార‌థాన్ విజేత‌గా నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానంలో కెన్యాకే చెందిన బ్రిగిడ్ కోస్గీ , మూడో స్థానంలో మోలీ సీడెల్ నిలిచింది. ఇక పురుషుల మార‌థాన్ టైటిల్ నిల‌బెట్టుకున్నాడు కెన్యాకు చెందిన కిప్‌చోగె. నెద‌ర్లాండ్స్‌కు చెందిన న‌గీయె, బెల్జియంకు చెందిన అబ్ది రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.