Typhoon Rai : ఫిలిప్పీన్స్లో రాయ్ తుపాను బీభత్సం.. 12కి పెరిగిన మృతుల సంఖ్య
రాయ్ తుపాను ఫిలిప్పీన్స్ లో బీభత్సం సృష్టిస్తోంది. వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్థంభించింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మృతుల సంఖ్య 12కి పెరిగింది. వరదలు ముంచెత్తడంతో..
Typhoon Rai : రాయ్ తుపాను ఫిలిప్పీన్స్ లో బీభత్సం సృష్టిస్తోంది. వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్థంభించింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మృతుల సంఖ్య 12కి పెరిగింది. వరదలు ముంచెత్తడంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి.
వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. విసాయా-పలావాన్ దీవుల మధ్య ఉన్న 8 ప్రాంతాల్లోని 3 లక్షల మందిని ప్రభుత్వం తరలించింది. టైఫూన్ తో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆహారం, నీళ్లు లేక జనం అలమటిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం తుపానుతో 1.3 కోట్ల మంది ప్రభావితమయ్యారు. తుపాను ప్రభావంతో 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ ఏడాది 50 తుపాన్లు ఫిలిప్పీన్స్ పై విరుచుకుపడగా.. ఇదే అత్యంత శక్తిమంతమైన తుపాను అని అధికారులు తెలిపారు. ఈ తుపానును అమెరికా ‘సూపర్ టైఫూన్’గా అభివర్ణించింది.
‘రాయ్’ను ‘కేటగిరీ 5’ తుపానుగా ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యంత వేగంగా కదులుతున్న ఈ తుపాను ప్రస్తుతం బలహీనపడిందని తెలిపింది. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు పునరావాసం కల్పించారు. వారికి తాగునీరు, ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్లోకి ఇవి తీసుకోండి
రాకాసి తుపాను కారణంగా విమానాలు, ఓడరేవులను పూర్తిగా మూసివేశారు. ఫిలిప్పీన్స్లో ప్రధానంగా 8 ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం సూచించింది. తుపాను తర్వాత కూడా దేశవ్యాప్తంగా బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.